Python Rescue Eturunagaram Forest
ఆకేరు న్యూస్ , ఏటూరునాగారం:
ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం శంకరాజుపల్లి గ్రామంలో ఆదివారం స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. గ్రామంలోని ఒక పాత రైస్ మిల్లులో భారీ కొండచిలువ కనిపించడంతో స్థానికులు వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు.
అటవీశాఖ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకున్నారు. రైస్ మిల్లులో దాగి ఉన్న కొండచిలువను వారు చాకచక్యంగా, సురక్షితంగా పట్టుకున్నారు. అనంతరం ఎలాంటి హాని కలగకుండా, సమీపంలోని దట్టమైన అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి విడిచిపెట్టారు. కొండచిలువను పట్టుకోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.
ఈ రెస్క్యూ ఆపరేషన్లో అటవీశాఖ సెక్షన్ ఆఫీసర్ తారతో పాటు బీట్ ఆఫీసర్లు దయానంద్, హరీశ్, సాంబయ్య, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. వన్యప్రాణులు జనావాసాల్లోకి వచ్చినప్పుడు వాటికి హాని చేయకుండా అటవీశాఖకు సమాచారం అందించినందుకు , స్థానికులను ఫారెస్ట్ అధికారులు అభినందించారు.
—–
