Kamalapur Paddy Procurement Issue
ఆకేరు న్యూస్, కమలాపూర్:
హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలో ధాన్యం, మొక్కజొన్న కొనుగోళ్లలో జరుగుతున్న ఆలస్యాన్ని నివారించాలని, తాలు, తరుగు, బి-కేటగిరి పేరుతో రైతులను ముంచుతున్న మిల్లర్ల దోపిడీని అరికట్టాలని డిమాండ్ చేస్తూ గురువారం బిజెపి మండల అధ్యక్షుడు ర్యాకం శ్రీనివాస్ ఆధ్వర్యంలో తహసీల్దార్ ఎం.సురేష్కు వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యం, ప్రణాళికా లోపం వల్ల రైతులు కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తూ, రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేయాల్సి వస్తోందని బిజెపి శ్రేణులు ఆవేదన వ్యక్తం చేశారు.
నాణ్యమైన ధాన్యానికి కూడా బి-కేటగిరి కింద క్వింటాలుకు రూ.20 వరకు తక్కువ చెల్లిస్తూ రైతుల సొమ్ము దోచుకుంటున్నారని, కేంద్రాల్లో వేసిన తూకం ప్రకారమే పూర్తి పేమెంట్ ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. నిబంధనలు ఉల్లంఘించే మిల్లర్లపై క్రిమినల్ కేసులు పెట్టాలన్నారు. అలాగే, వర్ష సూచన ఉన్నందున ధాన్యం తడవకుండా సరిపడా టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలని, అదనపు లారీలను ఏర్పాటు చేసి రాబోయే రెండు మూడు రోజుల్లో ధాన్యాన్ని వేగంగా మిల్లులకు తరలించాలని కోరారు. తహసీల్దార్ తక్షణమే స్పందించి కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని, లేనిచో రైతుల పక్షాన పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.
కార్యక్రమంలో మండల బిజెపి ప్రధాన కార్యదర్శులు తూర్పాటి భాస్కర్, జెట్టి సారంగపాణి, కమలాపూర్ సర్పంచ్ పబ్బు సతీష్, నాయకులు బండి కళాధర్, మేకల రవి, కొత్తపల్లి రాజు, బుర్ర కరుణాకర్, కట్కూరి అశోక్ రెడ్డి, తుమ్మ శోభన్, పెండ్యాల తిరుపతి రెడ్డి, మేడిపల్లి రాజు, చిట్టి సుందరయ్య, ఓసుకుల కీర్తన, ఇజ్జిగిరి సంపత్, పుస్కూరి రాంబాబు, రజనీ కాంత్, బుర్ర కుమారస్వామి, మేర ప్రసాద్, బోయిని సుభాష్, చందర్ సింగ్, మార్క అశోక్ పాల్గొన్నారు.
