Revanth Reddy Delhi Visit
* దేశ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించనున్న ‘తెలంగాణ హైబ్రీడ్ మోడల్
* దక్షిణాదికి అన్యాయం జరగకుండా సరికొత్త ప్రతిపాదన
ఆకేరు న్యూస్, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి నేడు దేశ రాజధాని ఢిల్లీలో పర్యటించనున్నారు. ఈ పర్యటన కేవలం రాజకీయ మర్యాద పూర్వకమైనది మాత్రమే కాకుండా, దేశ రాజకీయాల్లో అత్యంత కీలకమైన డీలిమిటేషన్ (నియోజకవర్గాల పునర్విభజన) మరియు మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చించేందుకు ఆయన సిద్ధమయ్యారు. ప్రధానంగా ఇండియా కూటమి నేతలతో సమావేశమై, రాబోయే డీలిమిటేషన్ ప్రక్రియలో రాష్ట్రాలకు జరగబోయే నష్టాన్ని నివారించేందుకు తన ‘హైబ్రీడ్ మోడల్’ను ప్రతిపాదించనున్నారు.
* ఏమిటీ రేవంత్ రెడ్డి ‘హైబ్రీడ్ మోడల్’?
సాధారణంగా నియోజకవర్గాల పునర్విభజన కేవలం జనాభా ప్రాతిపదికన జరుగుతుంది. దీనివల్ల జనాభా నియంత్రణ పాటించిన దక్షిణాది రాష్ట్రాలు పార్లమెంట్ సీట్లను కోల్పోయే ప్రమాదం ఉంది. దీనిని అడ్డుకోవడానికి రేవంత్ రెడ్డి 50-50 ఫార్ములాను తెరపైకి తెచ్చారు. నియోజకవర్గాల కేటాయింపులో సగం ప్రాధాన్యత జనాభాకు ఇవ్వాలి.
50% జీఎస్డీపీ (GSDP) మిగిలిన సగం ప్రాధాన్యత ఆయా రాష్ట్రాల ఆర్థిక అభివృద్ధి, జీఎస్డీపీ మరియు దేశ వృద్ధికి అందిస్తున్న తోడ్పాటుకు ఇవ్వాలి.
ఈ రెండు ప్రమాణాలను కలిపి డీలిమిటేషన్ చేయడం వల్ల అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలకు అన్యాయం జరగదని సీఎం భావిస్తున్నారు.
* సమతుల్యత కోసం పోరాటం
కేవలం జనాభాను ప్రామాణికంగా తీసుకుంటే, జనాభా ఎక్కువగా ఉన్న ఉత్తరాది రాష్ట్రాలకు ఎంపీ సీట్లు పెరుగుతాయి, అభివృద్ధి చెందుతున్న దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గుతుంది. ఇది సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని రేవంత్ రెడ్డి వాదిస్తున్నారు. అందుకే ఆర్థికాభివృద్ధిని కూడా ఒక కొలమానంగా తీసుకోవాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు.
* జాతీయ స్థాయిలో చర్చ…
ఈ పర్యటనలో భాగంగా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీతో పాటు ఇండియా కూటమిలోని కీలక నేతలను కలవనున్నారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ ఆలోచనా విధానాన్ని దేశవ్యాప్తంగా ప్రచారం చేయాలని, కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని సీఎం నిర్ణయించుకున్నారు. ఈ ప్రతిపాదనపై జాతీయ స్థాయిలో మేధావులు మరియు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ మొదలైంది.
