* సింగరేణి సీఎండీ కీలక ఆదేశాలు
ఆకేరున్యూస్, హైదరాబాద్: పెరుగుతున్న విద్యుత్ డిమాండ్ను దృష్టిలో ఉంచుకుని సింగరేణి (SINGARENI) తో ఒప్పందం ఉన్న థర్మల్ విద్యుత్ కేంద్రాలకు బొగ్గు ఉత్పత్తి పెంచాలని సింగరేణి సీఎండీ బలరామ్ ( Balaram) ఆదేశాలు జారీ చేశారు. సరిపడా బొగ్గును సరఫరా చేసేందుకు వీలుగా రోజుకు 2.5 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి, రవాణా చేయాలని సీఎండీ (CMD) ఆదేశించారు. బొగ్గు ఉత్పత్తి సాధనకు వీలుగా రోజుకు 16 లక్షల క్యూబిక్ మీటర్ల ఓవర్ బర్డెన్ను తొలగించాలని సూచించారు. బొగ్గు ఉత్పత్తిపై అన్ని ఏరియాల జీఎంలతో సీఎండీ మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించి ఈ ఆర్థిక సంవత్సరంలో మిగిలి ఉన్న 120 రోజుల్లో ప్రతి నిమిషం విలువైనదని.. ఉత్పత్తి లక్ష్య సాధనకు అన్ని ఏరియాలు సమష్టిగా కృషి చేయాలన్నారు.
బొగ్గు ఉత్పత్తి ఆలస్యం కాకుండా ప్రతి గని మేనేజర్, ప్రాజెక్టు అధికారి చొరవ తీసుకోవాలని ఆదేశించారు. ఉదయం 7 గంటల వరకు అందరు అధికారులు గనుల వద్దకు చేరుకోవడంతో పాటు.. ప్రతి ఒక్కరూ విధిగా 8 గంటల పాటు పనిచేసేలా చూడాలన్నారు. కంపెనీ యంత్రాల పనితీరును మెరుగుపరచాలని, కనీసం 18 గంటలు వినియోగించేలా చూడాలన్నారు. అదే సమయంలో ఉత్పత్తి సాధనలో నాణ్యతకు, రక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. నూతన ప్రాజెక్టులైన కొత్తగూడెంలోని వీకే ఓసీ, ఇల్లందులోని రోంపేడు ఓసీలో వచ్చే మూడు నెలల్లో ఉత్పత్తి ప్రారంభమయ్యేలా చూడాలని సూచించారు.
…………………………………..