
ఆకేరున్యూస్, వరంగల్: ఇటీవల వెలువడిన ఇంటర్మీడియట్ ఫలితాలలో రాష్ట్రస్థాయిలో అత్యుత్తమ మార్కులు సాధించిన జిల్లాలోని పలు ప్రభుత్వ జూనియర్ కళాశాలల విద్యార్థిని, విద్యార్థులను హనుమకొండ జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య అభినందించారు. హసన్ పర్తి ప్రభుత్వ జూనియర్ కళాశాల, హనుమకొండలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, వడ్డేపల్లి లోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల, ధర్మసాగర్ లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు చెందిన విద్యార్థిని విద్యార్థులు రాష్ట్రస్థాయిలో ఉత్తమ మార్కులు సాధించగా గురువారం జిల్లా కలెక్టరేట్ లో కలెక్టర్ అభినందించి శాలువాలతో ఘనంగా సత్కరించారు.అనంతరం మాట్లాడుతూ ఇంటర్మీడియట్ ఫలితాల్లో జిల్లాలోని ప్రభుత్వ కళాశాలలకు చెందిన విద్యార్థులు రాష్ట్రస్థాయిలో ఉత్తమ మార్కులు సాధించి జిల్లాకు మంచి పేరును తీసుకువచ్చారని అన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు చెందిన విద్యార్థిని విద్యార్థులు రానున్న రోజుల్లోనూ ఇదేవిధంగా రాష్ట్రస్థాయి ఫలితాల్లో జిల్లా పేరును ముందు నిలపాలని ఆకాంక్షించారు.
…………………………………