
* హనుమకొండ కలెక్టర్ ప్రావిణ్య
ఆకేరున్యూస్, వరంగల్: భూభారతి చట్టం ద్వారా వివిధ రకాల భూ సమస్యలను పరిష్కరించుకునే అవకాశం ఉందని హనుమకొండ జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య పేర్కొన్నారు. గురువారం హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలోని కమ్యూనిటీ హాలులో భూభారతి చట్టం -రైతుల చుట్టం అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సదస్సులో పాల్గొన్న జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ భూ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన భూభారతి చట్టం గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలన్నారు. అవగాహన సదస్సుకు హాజరైన ప్రతి ఒక్కరూ తమ తమ గ్రామాల్లోని రైతులు ప్రజలకు చట్టంలోని అంశాలను తెలియజేయాలన్నారు.భూ సమస్యలు, రికార్డుల్లో తప్పులను తహసిల్దార్, ఆర్డీవో, కలెక్టర్ స్థాయిల్లో సవరించుకునే అవకాశాన్ని భూభారతి చట్టం కల్పించిందన్నారు. సాదా బైనామా దరఖాస్తులపై ఆర్డిఓ విచారించి, పంచనామా చేసిన అనంతరం పట్టాలు ఇవ్వడం జరుగుతుందన్నారు. విరాసత్ అనేది 30 రోజుల్లో తహసిల్దార్ చేయాలని చట్టంలో ఉందన్నారు. భూములకు సంబంధించి ఏవైనా అభ్యంతరాలు ఉన్నట్లయితే తహసిల్దార్ ఇచ్చిన ఆర్డర్ పై ఆర్డీవో, కలెక్టర్, సిసిఎల్ఏ స్థాయిల్లో తమ అభ్యంతరాలను తెలియజేయవచ్చునని పేర్కొన్నారు. పది రోజుల్లో ప్రారంభం కానున్న భూభారతి చట్టం ఆన్లైన్ పోర్టల్ లో తమ భూ సమస్యలపై దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందన్నారు. వచ్చిన దరఖాస్తులను విచారించి వాటి పరిష్కారానికి చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు.
………………………………….