MP Kadiyam Kavya Voter Rights
* బీజేపీ కుట్రలను ప్రజాస్వామ్యబద్ధంగా తిప్పికొట్టాలి
.. వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర
అధికారం కోసం బిజెపి పన్నుతున్న కుట్రలను ప్రజాస్వామ్య బద్దంగా తిప్పి కొట్టాలని వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య పిలుపునిచ్చారు. ఎన్నికల్లో విజయం కేవలం ప్రచారంతో సాధ్యపడదని, బలమైన ఓటర్ల జాబితా నిర్మాణంతోనే విజయానికి పునాది పడుతుందని ప్రజాస్వామ్య పరిరక్షణలో బూత్ లెవల్ ఏజెంట్ల పాత్ర అత్యంత కీలకమని, ప్రతి బిఎల్ ఎ పార్టీకి సైనికుడిలా పనిచేస్తూ ప్రతి ఓటును కాపాడాలని ఎంపీ పిలుపునిచ్చారు.
జనగామ జిల్లా రఘునాథ్పల్లి మండలం, నిడిగొండ సత్యసాయి కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ బూత్ లెవల్ ఏజెంట్ల శిక్షణ కార్యక్రమం శనివారం జరిగింది. శాసనసభ్యులు కడియం శ్రీహరితో కలిసి వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా SIR (Special Intensive Revision) ప్రక్రియపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా బూత్ స్థాయి నాయకులకు సమగ్ర అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య మాట్లాడుతూ దేశంలో ఓటర్ల జాబితాలను రాజకీయ ప్రయోజనాల కోసం వినియోగించే ధోరణి ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని అన్నారు. ముఖ్యంగా బీజేపీ ఓటర్ల జాబితాల విషయంలో అనుసరిస్తున్న విధానం ఆందోళన కలిగిస్తోందని విమర్శించారు. ప్రజల మద్దతుతో గెలవలేని పరిస్థితుల్లో ఓటర్ల జాబితాల్లో మార్పుల ద్వారా రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఓటు హక్కు అనేది ప్రతి పౌరుడి రాజ్యాంగబద్ధమైన హక్కు. అది ఎలాంటి కారణాలతోనూ కోల్పోకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉంది అన్నారు. ఓటు చోరీ ప్రయత్నాలపై అప్రమత్తంగా ఉండాలని బూత్ అధ్యక్షుడు, BLA, కాంగ్రెస్ కార్యకర్త ఓటు హక్కు పరిరక్షణ కోసం క్షేత్రస్థాయిలో యోధుడిలా పనిచేయాలని ఎంపీ డాక్టర్ కడియం కావ్య అన్నారు.
ఎన్నికల సమయంలో మాత్రమే కాకుండా, ఓటర్ల జాబితాల సవరణ ప్రక్రియ జరుగుతున్న ప్రతి దశలోనూ అప్రమత్తత అవసరమని ఎంపీ సూచించారు. ఇప్పటివరకు ఓటు వేసిన వారికీ కూడా భవిష్యత్తులో జాబితాలో పేరు లేకపోయే పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని హెచ్చరించారు. అందుకే ప్రతి ఇంటికి వెళ్లి ఓటర్ల వివరాలను పరిశీలించాలని సూచించారు.
వచ్చే మూడు నెలలు డోర్ టు డోర్ ఓటర్ వెరిఫికేషన్ కార్యక్రమాన్ని నిర్వహించాలని, కొత్త ఓటర్ల నమోదు, చిరునామా మార్పుల సవరణ, తొలగించబడిన పేర్ల గుర్తింపు వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఎంపీ కోరారు. ప్రతి అర్హుడికి ఓటు హక్కు కల్పించడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రతి బూత్లో కాంగ్రెస్ కార్యకర్తలు సమన్వయంతో పనిచేస్తే పార్టీ విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరని పేర్కొన్నారు, శిక్షణలో నేర్చుకున్న అంశాలను క్షేత్రస్థాయిలో అమలు చేసి ప్రజలతో నిరంతర సంబంధాలు కొనసాగించాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికి చేరవేయడంతో పాటు, పార్టీ సిద్ధాంతాలను ప్రజలకు వివరించే బాధ్యత కూడా బూత్ ఏజెంట్లపై ఉందని తెలిపారు.
దేశంలో ఎన్నికల వ్యవస్థ పారదర్శకంగా ఉండాలని, ఓటు హక్కు పరిరక్షణ కోసం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేస్తున్న పోరాటం ప్రజాస్వామ్య విలువలను కాపాడడానికేనని ఎంపీ పేర్కొన్నారు. “ఓటర్ల జాబితానే ఎన్నికల విజయానికి తొలి అడుగు. బూత్ బలంగా ఉంటేనే పార్టీ బలంగా ఉంటుంది. బీజేపీ కుట్రలను క్షేత్రస్థాయిలోనే తిప్పికొట్టి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం” అని డాక్టర్ కడియం కావ్య పిలుపునిచ్చారు.
అనంతరం వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య రూపొందించిన ‘బూత్ లెవల్ ఏజెంట్స్ సంక్షిప్త సమాచారం హ్యాండ్బుక్’ ను ఆవిష్కరించి BLAలు, డివిజన్ ఇన్చార్జ్లకు అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ శంకర్ నాయక్, నియోజకవర్గ పార్టీ పరిశీలకులు దుద్దిళ్ల శ్రీనివాస్, బూత్ లెవల్ ఏజెంట్స్ ట్రైనర్ పి. రాజశేఖరరెడ్డి, జనగామ జిల్లా డీసీసీ అధ్యక్షురాలు లకావత్ ధన్వంతి, హనుమకొండ జిల్లా డీసీసీ అధ్యక్షులు ఇనుగాల వెంకట్రాంరెడ్డి, తెలంగాణ ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ ఛైర్మన్ జంగా రాఘవరెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ మారుజోడు రాంబాబు, మున్సిపాలిటీ ఛైర్మన్ తాటికొండ వినయ్కుమార్, వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ లావణ్య శిరీష్ రెడ్డి, జనగామ, హనుమకొండ జిల్లాల కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులు, ఏడు మండలాల పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర, జిల్లా అనుబంధ సంఘాల అధ్యక్షులు, కార్యదర్శులు, మాజీ జడ్పీటీసీలు, మాజీ ఎంపీపీలు, పీఏసీఎస్ ఛైర్మన్లు, దేవస్థాన కమిటీ ఛైర్మన్లు, బూత్ అధ్యక్షులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
