* బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
ఆకేరున్యూస్, హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో స్వేచ్ఛను హరిస్తున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ప్రజాస్వామ్య బద్ధంగా నిరసన తెలుపుతుంటే అడ్డుకుంటున్నారని చెప్పారు. బీఆర్ఎప్ ప్రభుత్వంలో ప్రపంచంలో ఎక్కడా లేనట్లుగా 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని కేసీఆర్ ఏర్పాటు చేసి సచివాలయానికి కూడా అంబేద్కర్ పేరు పెట్టి గౌరవించుకున్నామన్నారు. తమమీద అక్కసుతో బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి రోజు కనీసం గేట్లు కూడా తెరవకుండా ఆ మహానీయున్ని నిర్భంధించి కాంగ్రెస్ ప్రభుత్వం అవమానిస్తుందన్నారు. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా తెలంగాణ భవన్లో పార్టీ నేతలతో కలిసి అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ.. దళితబంధు తొలగించి అంబేద్కర్ అభయహస్తం తెస్తామన్నారు.. ఇప్పటివరకు దాని అమలు ఊసేలేదని విమర్శించారు. దళితబంధు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న వారిపై దండిగా కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. అంబేద్కర్ విగ్రహం దగ్గర ఎలాంటి ఏర్పాట్లు చేయలేదని.. వందల మంది పోలీసులను పెట్టి తమను నిర్బంధిస్తున్నారని విమర్శించారు. అలాగే సచివాలయంలో రేవంత్ రెడ్డి ప్రతిష్టిస్తున్నది తెలంగాణ తల్లి విగ్రహమా లేదా కాంగ్రెస్ తల్లి విగ్రహమా అని ప్రశ్నించారు. ప్రభుత్వం మారినప్పుడల్లా లోగోలు, నంబర్ ప్లేట్లు మారాలా అని ధ్వజమెత్తారు. తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాల్సిన చోట రాజీవ్గాంధీ విగ్రహం పెట్టారని విమర్శించారు.
…………………………………..
Please tell us what is wrong. Your report will be sent to the website team.
