Harish Delhi visit Kaleshwaram
* హరీష్ రావు సడన్ టూర్ వెనుక అసలు మాస్టర్ ప్లాన్
* కాళేశ్వరం కేసులో ఎల్లుండే తీర్పు.. అందుకే ఢిల్లీకి
ఆకేరు న్యూస్, జగిత్యాల: తెలంగాణ రాజకీయాల్లో మాజీ మంత్రి, బీఆర్ఎస్ కీలక నేత హరీష్ రావు ఢిల్లీ పర్యటన ఇప్పుడు పెను సంచలనంగా మారింది. నేడు జగిత్యాలలో బీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న బహిరంగ సభకు ఆయన హాజరుకావాల్సి ఉండగా, అనూహ్యంగా ఆయన తన పర్యటనను రద్దు చేసుకుని హస్తిన బాట పట్టారు. దీని వెనుక బలమైన కారణాలు ఉన్నాయని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
* కాళేశ్వరం కేసు – హైకోర్టు తీర్పు
కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి నమోదైన కేసులో హైకోర్టు ఎల్లుండి (బుధవారం) తుది తీర్పు వెలువరించనుంది. జస్టిస్ పి.సి. ఘోష్ కమిషన్ నివేదికపై స్టే కోరుతూ గతంలో హరీష్ రావు పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, హైకోర్టు తీర్పు తమకు ప్రతికూలంగా వస్తే అనుసరించాల్సిన వ్యూహాలపై న్యాయ నిపుణులతో చర్చించేందుకు హరీష్ రావు ఢిల్లీకి వెళ్లినట్లు తెలుస్తోంది.
* కేసీఆర్ సూచనతోనే ఢిల్లీకి?
పార్టీ బహిరంగ సభ కంటే న్యాయపరమైన అంశాలే ప్రస్తుతానికి కీలకమని పార్టీ అధినేత కేసీఆర్ భావించినట్లు సమాచారం. ఒకవేళ హైకోర్టు తీర్పు వ్యతిరేకంగా వస్తే, వెంటనే సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసేందుకు (Special Leave Petition) ముందస్తుగానే రంగం సిద్ధం చేసుకోవాలని కేసీఆర్ సూచించినట్లు బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. దీనికోసం దేశ రాజధానిలోని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులతో హరీష్ రావు సమావేశం కానున్నారు.
* శ్రేణుల్లో ఆందోళన
జగిత్యాల సభలో హరీష్ రావు ప్రసంగం కోసం ఎదురుచూస్తున్న కార్యకర్తలు ఆయన గైర్హాజరీతో కొంత నిరాశకు గురయ్యారు. అయితే, పార్టీని మరియు కీలక నేతలను న్యాయపరమైన చిక్కుల నుండి కాపాడుకోవడం అత్యవసరమని నేతలు సర్దిచెబుతున్నారు. కాళేశ్వరం నివేదికపై కోర్టు ఎలాంటి వ్యాఖ్యలు చేయబోతుందనేది ఇప్పుడు ఇటు రాజకీయ వర్గాల్లో, అటు ప్రజల్లో తీవ్ర ఉత్కంఠను రేపుతోంది.
