* హెల్మెట్ లేకపోతే ప్రమాదం- ఎస్పీ శబరీష్
* యువకులతో కలిసి బైక్ ర్యాలీ చేసిన ఎస్పీ
ఆకేరు న్యూస్, మహబూబాబాద్:
మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం గోపాలపురం గ్రామంలో పోలీసుల ఆధ్వర్యంలో ‘మన ఊరు మన బాధ్యత’ అవగాహన సదస్సును ఘనంగా నిర్వహించారు. రోడ్డు ప్రమాదాల నివారణే ధ్యేయంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా యువకులతో కలిసి ఎస్పీ భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ప్రతి ఒక్కరూ బైక్ నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని ఆయన పిలుపునిచ్చారు.
* ప్రాణ రక్షణే ముఖ్యం – ఎస్పీ శబరీష్
ర్యాలీ అనంతరం ఎస్పీ శబరీష్ మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు తలకు తీవ్ర గాయాలు కావడం వల్లే ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. హెల్మెట్ ధరించి ప్రయాణం చేయడం వల్ల ప్రమాదాలు జరిగినప్పటికీ ప్రాణాపాయం నుండి తప్పించుకోవచ్చని ఆయన స్పష్టం చేశారు.
* యువత బాధ్యత తీసుకోవాలి..
గ్రామాల్లో ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించేలా యువత చొరవ చూపాలని, విస్తృతంగా ప్రచారం చేయాలని ఎస్పీ కోరారు. ‘మన ఊరు మన బాధ్యత’ కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో శాంతిభద్రతల పరిరక్షణకు, సామాజిక చైతన్యానికి యువత పోలీసులకు సహకరించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక పోలీస్ అధికారులు, గ్రామానికి చెందిన పెద్దలు, భారీ సంఖ్యలో యువకులు పాల్గొన్నారు.
