Huzurabad Dumping Yard Protest
ఆకేరు న్యూస్, హుజురాబాద్:
హుజురాబాద్ లో ప్రతిపాదించిన డంపింగ్ యార్డ్ వల్ల ప్రజల ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం ఉందని, దానిని వెంటనే రద్దు చేయాలని కోరుతూ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి రాష్ట్ర మంత్రులకు వినతి పత్రం సమర్పించారు. మంత్రులు తుమ్మల నాగేశ్వర్ రావు, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తో పాటు, ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ లను కలిసి హుజురాబాద్ ప్రజల ఆందోళనను ఆయన వివరించారు.
గ్రామాలు, పట్టణాలకు సమీపంలో ఈ డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయడం వల్ల వెలువడే దుర్వాసనతో పర్యావరణం కలుషితం అవుతుందని, భూగర్భ జలాలు విషతుల్యమై తాగునీటి సమస్యలు తలెత్తుతాయని ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు. దీనివల్ల రోగాలు వ్యాప్తి చెందుతాయని, ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, గర్భిణీల ఆరోగ్యంపై ఈ ప్రాజెక్టు తీవ్ర ప్రభావం చూపుతుందని ఆయన హెచ్చరించారు. అంతేకాకుండా, పరిసర ప్రాంతాల్లో జీవన ప్రమాణాలు పడిపోయి, భూముల విలువ కూడా తగ్గిపోయే అవకాశం ఉందని పేర్కొన్నారు. హుజురాబాద్ ప్రజల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసిన కౌశిక్ రెడ్డి, ప్రజల పక్షాన తన పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
