MLA Revuri Prakash PARKAL Market Facilities Inspection
* పరకాల మార్కెట్లలో మౌలిక వసతులు కల్పించాలి
– ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి
ఆకేరు న్యూస్,పరకాల:
పరకాల పట్టణ కేంద్రంలోని కూరగాయల మరియు చేపల మార్కెట్లను స్థానిక శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి అధికారులతో కలిసి శనివారం ఆకస్మికంగా పరిశీలించారు. మార్కెట్లలోని పారిశుధ్య స్థితిగతులు, మౌలిక వసతులు మరియు వ్యాపారులు, వినియోగదారులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆయన క్షేత్రస్థాయిలో ఆరా తీశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ…
ప్రజలకు, వ్యాపారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మార్కెట్లలో మెరుగైన సౌకర్యాలు కల్పించడమే తమ ప్రాధాన్యత అని పేర్కొన్నారు. మార్కెట్ ఆవరణలో పారిశుధ్యాన్ని నిరంతరం పర్యవేక్షించాలని, చెత్తాచెదారాన్ని ఎప్పటికప్పుడు తొలగించాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. మార్కెట్లలో దుర్వాసన రాకుండా, వ్యాధులు ప్రబలకుండా నిత్యం శుభ్రపరచాలని సూచించారు, కొనుగోలుదారుల కోసం స్వచ్ఛమైన తాగునీటి సదుపాయం మరియు సరిపడా విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలన్నారు.
స్థానిక చిరు వ్యాపారుల సమస్యలను విని, వాటిని త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలి. పట్టణ ప్రజలకు మెరుగైన సేవలందించేందుకు అవసరమైన అన్ని చర్యలు తక్షణమే చేపట్టాలని సంబంధిత అధికారులకు ఆయన స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, మున్సిపల్ అధికారులు, మార్కెట్ కమిటీ నాయకులు మరియు స్థానిక వ్యాపారులు పాల్గొన్నారు
