CP Sunpreet Singh NEET Exam Security Warangal
* నీట్ పరీక్షా కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలి
* సోషల్ మీడియా కథనాలపై దృష్టి పెట్టాలి
-వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్
అకేరు న్యూస్ వరంగల్ : నీట్ పరీక్ష (NEET EXAM) జరిగే పరీక్షా కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాల్సిందిగా వరంగల్ పోలీస్ కమిషనర్ అధికారులను అదేశించారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ వ్యాప్తంగా 15 కేంద్రాల్లో రేపు నిర్వహింబడే నీట్ పరీక్షను సజావుగా నిర్వహించేందుకు ఏర్పాటు చేయాల్సిన బందోబస్తు ఏర్పాట్లపై వరంగల్ పోలీస్ కమిషనర్ క్యాంపు కార్యాలయము నుండి శనివారం సంబందిత పోలీస్ అధికారుల వీడియో సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సమావేశంలో పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ ప్రతి కేంద్రంలో ఒక ఇన్స్స్పెక్టర్ స్థాయి అధికారి పర్యవేక్షణలో పోలీసులు పటిష్టమైన బందోబస్తు నిర్వహించాలని, పరీక్ష కేంద్రంలోనికి వచ్చే ప్రతి విద్యార్థిని ముమ్మరంగా తనిఖీలు చేయడంతో పాటు, వారితో పాటు ఎలాక్ట్రానిక్ పరికరాలను అనుమతించవద్దని, పరీక్ష కేంద్రం వద్ద కేంద్ర బలగాలకు చెందిన సి.ఆర్.పి.ఎఫ్ పోలీసులు సైతం విధులు నిర్వహిస్తారని కావున స్థానిక పోలీసులు సమన్వయంతో కలిసి పనిచేయాల్సి వుంటుందని అన్నారు.
పరీక్షకు సంబంధించిన పత్రాలను పరీక్షా కేంద్రాలకు తరలించే సమయంలో పాటు పరీక్ష అనంతరం పరీక్ష పత్రాలను సేఫ్ హౌస్లకు తరలించే సమయంలో పోలీస్ అధికారులు అప్రమత్తంగా వుండాలని. అలాగే పరీక్ష జరిగే సమయంలో పరీక్ష కేంద్రం పరిసరాల్లో ముమ్మరంగా పెట్రోలింగ్ నిర్వహించడంతో పాటు, పరీక్ష జరిగే ప్రాంతంలో జిరాక్స్ సెంటర్లు మూసివేయించాలని, అదే విధంగా నీట్ పరీక్షకు సంబంధించి ఎలాంటి పుకార్లు ప్రచారం కాకుండా జాగ్రత్త పడటంతో పాటు, ఇందుకు సంబంధించి సోషల్ మీడియాలో కథనాలపై స్టేషన్ అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని పోలీస్ కమిషనర్ అధికారులను అదేశించారు.
