CP Sumathi secret operation
* పోలీస్ బాస్ అని తెలియక వేధించారు
* కట్ చేస్తే 40 మంది కటకటాల్లోకి
ఆకేరు న్యూస్, హైదరాబాద్: నగరంలో మహిళల భద్రత ఏ స్థాయిలో ఉందో తెలుసుకునేందుకు మల్కాజ్గిరి పోలీస్ కమిషనర్ సుమతి (IPS) స్వయంగా రంగంలోకి దిగారు. ఎటువంటి భద్రతా సిబ్బంది లేకుండా, సామాన్య మహిళగా మారి ఆమె చేపట్టిన ‘సీక్రెట్ ఆపరేషన్’ ఇప్పుడు పెద్ద చర్చకు దారితీసింది.
* ప్రత్యక్షంగా పరిశీలించిన సిపి…
మహిళలు అర్ధరాత్రి వేళ ప్రయాణాలు చేసేటప్పుడు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రత్యక్షంగా పరిశీలించాలని సీపీ సుమతి నిర్ణయించుకున్నారు. మంగళవారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఆమె సాధారణ దుస్తుల్లో (సివిల్ డ్రెస్) దిల్సుఖ్నగర్ బస్టాండ్కు చేరుకున్నారు. తెల్లవారుజామున 3 గంటల వరకు ఒక సామాన్య ప్రయాణికురాలిలా బస్సు కోసం వేచి చూస్తూ అక్కడే గడిపారు.
* ఆకతాయిల ఆగడాలు – 40 మంది అరెస్ట్…
అక్కడ ఉన్నది సాక్షాత్తూ పోలీస్ కమిషనర్ అని తెలియని దాదాపు 40 మంది పోకిరీలు ఆమె చుట్టూ చేరి అసభ్యకరంగా ప్రవర్తించడం, వేధించడం మొదలుపెట్టారు. విద్యార్థులు, యువకులు మద్యం మత్తులో ఆమెను ఇబ్బంది పెట్టారు. వారందరి ప్రవర్తనను గమనించిన కమిషనర్, వెంటనే తన బృందానికి సిగ్నల్ ఇచ్చారు. మారువేషంలో ఉన్న పోలీసులు వెంటనే రంగ ప్రవేశం చేసి ఆ 40 మందిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు.
* వెలుగులోకి వచ్చిన షాకింగ్ నిజాలు…
పెట్రోలింగ్ వైఫల్యం: కమిషనర్ మూడు గంటల పాటు బస్టాండ్లోనే ఉన్నా, ఒక్క పోలీస్ పెట్రోలింగ్ వాహనం కూడా ఆ పరిసరాల్లో కనిపించకపోవడంపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
మత్తులో యువత: పట్టుబడ్డ వారిలో ఎక్కువ మంది విద్యార్థులు ఉండటం ఆందోళన కలిగించే విషయం. కొందరు గంజాయి, మద్యం మత్తులో ఉన్నట్లు గుర్తించారు.
* కౌన్సెలింగ్ & కఠిన హెచ్చరిక
అరెస్టయిన వారందరినీ పోలీస్ స్టేషన్కు తరలించి, వారి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్ నిర్వహించారు. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే జీవితాలు ఎలా నాశనం అవుతాయో హెచ్చరించారు. ఈ ఘటనతో నగరంలోని పోకిరీలకు గట్టి సందేశం పంపినట్లయింది.
