
* ఆ ప్రాజెక్టు కోసం ప్రజల సొమ్ము ఖర్చు చేయవద్దు
* అది కేసీఆర్ విఫల ప్రాజెక్టు
* కూనంనేని సంచలన వ్యాఖ్యలు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : కాళేశ్వరం ప్రాజెక్టు పనికి రాదని, ప్రజల సొమ్ము ఆ ప్రాజెక్టుకు పనికి రాదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి , ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు (KUNAMNENI SAMBASIVA RAO)అభిప్రాయపడ్డారు. విఫల ప్రాజెక్టు కు నిధులు ఆపాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. హైదరాబాద్లో శనివారం ఉదయం జరిగిన సమావేశంలో కూనంనేని మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి అన్నీ తానై వ్యవహరించిన కేసీఆర్(KCR), ఇప్పుడు మాత్రం ప్రాజెక్టుతో తనకు ఎలాంటి సంబంధం లేనట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు.ఈ ప్రాజెక్టుతో రాష్ట్రంలో అదనంగా ఒక్క ఎకరాకు కూడా సాగునీరు అందలేదని ఆయన ఆరోపించారు. ప్రస్తుతం పంటలకు అందుతున్న నీరంతా ఎల్లంపల్లి ప్రాజెక్టు ద్వారానే వస్తోందని స్పష్టం చేశారు. కాళేశ్వరం (KALESWARAM) వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని, ఇది పూర్తిగా నిరుపయోగమైన ప్రాజెక్టు అని కూనంనేని అభిప్రాయపడ్డారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపైనా కూనంనేని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేంద్రం మానవ హక్కులను ఉల్లంఘిస్తోందని ఆరోపించారు. మావోయిస్టుల మృతదేహాలను చూసి కూడా కేంద్రంలోని పెద్దలు భయపడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. మావోయిస్టు నేత కేశవరావు మృతదేహాన్ని వారి కుటుంబ సభ్యులకు అప్పగించకపోవడం అత్యంత దారుణమని కూనంనేని అన్నారు.
…………………………………………..