* ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి
ఆకేరు న్యూస్, ఆత్మకూరు: భక్తుల ఆరాధ్య దైవాలైన అగ్రంపహాడ్ శ్రీ సమ్మక్క-సారలమ్మ జాతరను అత్యంత వైభవంగా, విజయవంతంగా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేసిందని పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి తెలిపారు. మంగళవారం ఆత్మకూరు మండలం అగ్రంపహాడ్ గ్రామంలో జరుగుతున్న జాతర ఏర్పాట్లను ఆయన అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.ముందుగా ఎమ్మెల్యే సమ్మక్క-సారలమ్మ తల్లులను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నియోజకవర్గ ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని కోరుతూ ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఉచిత వైద్య శిబిరం ప్రారంభం జాతరకు వచ్చే భక్తులకు అత్యవసర వైద్య సేవలు అందించే లక్ష్యంతో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత ఆరోగ్య శిబిరాన్ని ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భక్తుల ఆరోగ్య రక్షణ కోసం ఇలాంటి సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమన్నారు.జాతర ఏర్పాట్లపై సమీక్షిస్తూ ఎమ్మెల్యే అధికారులకు పలు సూచనలు చేశారుభక్తులకు తాగునీరు, విద్యుత్, రవాణా సౌకర్యాల్లో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడాలని, జాతర ప్రాంగణం పరిశుభ్రంగా ఉండేలా నిరంతరం పర్యవేక్షిస్తూ,భక్తులు కూడా పరిసరాలను శుభ్రంగా ఉంచేందుకు సహకరించాలని కోరారు. అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేసి జాతరను శాంతియుతంగా ముగించేలా చూడాలి.జాతరలో నిరంతరం శ్రమిస్తున్న పారిశుద్ధ్య కార్మికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని, వారికి ఎమ్మెల్యే స్వయంగా హెల్మెట్లను పంపిణీ చేశారు. వారి సేవలను ఈ సందర్భంగా ఆయన కొనియాడారు.జాతరను జయప్రదం చేసేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని MLA రేవూరి ప్రకాశ్ రెడ్డి అన్నారు.

……………………………………………….
