PM Modi Telangana tour
*హైటెక్ సిటీలో ఆసుపత్రి ప్రారంభోత్సవం
ఆకేరు న్యూస్, డెస్క్: తెలంగాణ అభివృద్ధికి ఊతమిచ్చేలా ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 10వ తేదీన హైదరాబాద్లో పర్యటించనున్నారు. సుమారు రూ. 7,823 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయడంతో పాటు, సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించనున్నారు. మోదీ పర్యటనకు సంబంధించి అధికారిక షెడ్యూల్ ఖరారైంది.
*ప్రధాని మోదీ పర్యటన పూర్తి షెడ్యూల్:
ప్రధాని మోదీ బెంగళూరు నుంచి నేరుగా హైదరాబాద్ చేరుకుంటారు. ఆయన పర్యటన వివరాలు ఇలా ఉన్నాయి.
మధ్యాహ్నం 1:10 గంటలకు: బెంగళూరు ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్కు బయలుదేరుతారు.
మధ్యాహ్నం 2:20 గంటలకు హైదరాబాద్ బేగంపేట్ ఎయిర్పోర్ట్కు చేరుకుంటారు.
మధ్యాహ్నం 2:30 గంటలకు బేగంపేట్ ఎయిర్పోర్ట్ వద్ద ఏర్పాటు చేసిన వేదికపై నుంచి వివిధ ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను వర్చువల్ పద్ధతిలో ప్రారంభిస్తారు. ఇందులో ప్రధానంగా కాజీపేట-విజయవాడ మూడో రైల్వే లైన్, మల్లాపూర్ పెట్రోలియం టెర్మినల్ వంటి కీలక ప్రాజెక్టులు ఉన్నాయి.
మధ్యాహ్నం 3:15 గంటలకు బేగంపేట్ నుంచి హెలికాప్టర్ ద్వారా హైటెక్ సిటీకి బయలుదేరుతారు.
మధ్యాహ్నం 3:45 – 4:15 గంటలకు హైటెక్ సిటీలో నూతనంగా నిర్మించిన సింధు హాస్పిటల్ (Sindhu Hospital) ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు.
సాయంత్రం 4:40 గంటలకు హెలికాప్టర్లో తిరిగి బేగంపేట్ ఎయిర్పోర్ట్కు చేరుకుంటారు.
సాయంత్రం 4:40 – 5:25 గంటలకు రిజర్వ్ టైమ్ (స్థానిక నాయకులతో భేటీ లేదా విశ్రాంతి).
సాయంత్రం 5:30 గంటలకు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్కు చేరుకుంటారు.
సాయంత్రం 5:30 – 6:30 గంటలకు పరేడ్ గ్రౌండ్స్లో నిర్వహించే భారీ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో ఈ సభ అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
సాయంత్రం 6:45 గంటలకు బేగంపేట్ ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో గుజరాత్లోని జామనగర్కు బయలుదేరుతారు.
*కీలక ప్రాజెక్టుల ప్రారంభోత్సవం..
ఈ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ వరంగల్లోని పీఎం మిత్ర కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ (PM MITRA) సహా పలు రైల్వే మరియు ఇంధన రంగ ప్రాజెక్టులను జాతికి అంకితం చేయనున్నారు. మోదీ రాక దృష్ట్యా నగరంలో పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.
