Right to Education Act Implementation
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్
విద్యా హక్కు చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని, అనుమతి లేని పాఠశాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా కన్వినర్ మొహమ్మద్ యూనుస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ మండల కేంద్రంలో సోమవారం ఆయన మాట్లాడుతూ ఈ నెల 15న పాఠశాలలు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రైవేట్ పాఠశాలల దోపిడీని అరికట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విద్యా హక్కు చట్టం (RTE)ను అనేక ప్రైవేట్ పాఠశాలలు ఉల్లంఘిస్తూ, విద్యాసంస్థలుగా కాకుండా వ్యాపార కేంద్రాలుగా మారాయని విమర్శించారు. విద్యార్థులు తప్పనిసరిగా పాఠశాలల నుంచే పుస్తకాలు, యూనిఫాంలు కొనుగోలు చేయాలని ఒత్తిడి తెచ్చి, పేద మరియు మధ్యతరగతి కుటుంబాలపై అదనపు ఆర్థిక భారం మోపుతున్నారని అన్నారు.అలాగే, సంబంధిత అధికారుల అనుమతులు లేకుండా నడుస్తున్న ప్రైవేట్ పాఠశాలలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
విద్య హక్కు చట్టం ప్రకారం బడుగు బలహీన పేద వర్గాలకు చెందిన విద్యార్థులకు ప్రతి ఒక్క ప్రైవేట్ స్కూల్లో 25% ఉచిత నిర్బంధ విద్య అందజేయాలని చట్టంలో ఉన్న జిల్లాలో ఏ ఒక్క పాఠశాల కూడా అమలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల భద్రత దృష్ట్యా పాఠశాల బస్సులకు అవసరమైన ఫిట్నెస్ సర్టిఫికెట్లు, భద్రతా ప్రమాణాలు తప్పనిసరిగా అమలు చేయాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసి, నాణ్యమైన విద్యను అందరికీ అందుబాటులోకి తీసుకురావడానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని కోరారు.
