Tamil Nadu Ammonia Gas Leak
* తమిళనాడులో ఘటన
* కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్
ఆకేరు న్యూస్, డెస్క్: తమిళనాడులో ఘోర ప్రమాదం సంభవించింది. తిరువళ్లూర్ జిల్లాలోని ఒక ప్రముఖ రొయ్యల ప్రాసెసింగ్ ఫ్యాక్టరీ (Prawn Processing Factory)లో ఒక్కసారిగా అమ్మోనియా గ్యాస్ లీకైంది. ఈ విష వాయువు పీల్చడం వల్ల ఫ్యాక్టరీలో రాత్రి షిఫ్ట్లో పనిచేస్తున్న ఏడుగురు మహిళా కార్మికులు అక్కడికక్కడే ఊపిరాడక మృతి చెందారు. మరో 40 మందికి పైగా కార్మికులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
పోలీసుల సమాచారం ప్రకారం.. తిరువళ్లూర్ పరిసర ప్రాంతంలో ఉన్న సదరు రొయ్యల నిల్వ, ప్రాసెసింగ్ కేంద్రంలో రొయ్యలను ఐస్ చేసి భద్రపరచడానికి ‘అమ్మోనియా గ్యాస్’ ప్లాంట్ను ఉపయోగిస్తున్నారు. అర్ధరాత్రి కార్మికులు విధుల్లో ఉన్న సమయంలో గ్యాస్ పైప్లైన్లో సాంకేతిక లోపం తలెత్తి తీవ్రస్థాయిలో అమ్మోనియా లీక్ కావడం ప్రారంభమైంది. నిమిషాల వ్యవధిలోనే ఫ్యాక్టరీ అంతా ఘాటైన వాయువు వ్యాపించింది.
అక్కడ పనిచేస్తున్న మహిళలు ఊపిరి తీసుకోలేక, కళ్ల మంటలతో కేకలు వేస్తూ స్పృహతప్పి పడిపోయారు. దట్టమైన గ్యాస్ కారణంగా బయటకు రావడానికి దారి దొరకక ఏడుగురు మహిళలు అక్కడే ప్రాణాలు విడిచారు.
* కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్…
ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు, విపత్తు నిర్వహణ బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. ప్రత్యేక మాస్కులు ధరించిన రెస్క్యూ సిబ్బంది ఫ్యాక్టరీ లోపల చిక్కుకుపోయిన కార్మికులను బయటకు తీసుకువచ్చారు. అస్వస్థతకు గురైన 40 మందికి పైగా మహిళలను హుటాహుటిన సమీపంలోని తిరువళ్లూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరిలో నలుగురి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
* అధికారుల ప్రకటన..
“ప్రస్తుతం గ్యాస్ లీకేజీని అదుపులోకి తెచ్చాం. ఫ్యాక్టరీలో భద్రతా ప్రమాణాలు పాటించారా లేదా అనే కోణంలో విచారణ జరుపుతున్నాం. నిర్లక్ష్యంగా వ్యవహరించిన యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకుంటాం.” అని జిల్లా యంత్రాంగం ప్రకటించింది.
ఈ ఘటనతో ఫ్యాక్టరీ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. బాధితుల కుటుంబ సభ్యులు ఫ్యాక్టరీ ముందు చేరి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఘటనపై తమిళనాడు ప్రభుత్వం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. బాధితులకు తక్షణమే మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించింది.
