Bike Collides with Stationary Borewell Lorry
ఆకేరు న్యూస్, పాలకుర్తి :
జనగామ జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పాలకుర్తి మండలం బమ్మెర గ్రామ శివారులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
* ప్రమాదం జరిగిందిలా..
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నర్సింగపురం తండాకు చెందిన కేతావత్ నరేందర్, బాదావత్ తిరుపతి అనే ఇద్దరు యువకులు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా బమ్మెర శివారు వద్ద రోడ్డుపై ఆగి ఉన్న బోర్వెల్ లారీని వెనుక నుంచి వేగంగా ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో బైక్ తీవ్రంగా ధ్వంసమైంది. తీవ్ర గాయాలపాలైన నరేందర్, తిరుపతి ఇద్దరూ ఘటనా స్థలంలోనే మృతి చెందారు.
* పోలీసుల దర్యాప్తు…
సమాచారం అందుకున్న పాలకుర్తి పోలీసులు వెంటనే ప్రమాద స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం నిమిత్తం జనగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు వేగవంతం చేశారు.
ఉపాధి కోసం, భవిష్యత్తు కోసం ఎన్నో ఆశలతో ఉన్న ఇద్దరు యువకులు ఒకేసారి ప్రమాదంలో మృతి చెందడంతో నర్సింగపురం తండాలో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి. మృతుల కుటుంబసభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటాయి.
