CM REVANTH REDDY ON HYDERABAD INDIRAMMA HOUSING SCHEME
* హైదరాబాద్ సిటీలోనే ఇందిరమ్మ ఇండ్లు
ఆకేరు న్యూస్, హైదరాబాద్: హైదరాబాద్ కోర్ అర్బన్ ఏరియా (CURE) పరిధిలో నిరుపేదల కోసం నిర్మించే ఇందిరమ్మ ఇండ్లను జనావాసాల మధ్య, ప్రజల పని ప్రదేశాలకు దగ్గరగా నిర్మించాలని తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు అధికారులను ఆదేశించారు. నగరానికి దూరంగా నివాసాలు ఏర్పాటు చేస్తే ఉపాధి అవకాశాలు దెబ్బతిని అవి నిరుపయోగంగా మారే ప్రమాదం ఉందని, అందుకే నగర నడిబొడ్డున అందుబాటులో ఉన్న స్థలాల్లోనే ఈ ప్రాజెక్టును వేగవంతం చేయాలని స్పష్టం చేశారు.
ఈ మేరకు డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ తెలంగాణ సచివాలయంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్లతో పాటు సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.
* శాఖల మధ్య స్థలాల సర్దుబాటు – నిరుపయోగ భూముల సేకరణ
అవుటర్ రింగ్ రోడ్డు (ORR) లోపల వివిధ ప్రభుత్వ శాఖలకు సంబంధించి ఖాళీగా, నిరుపయోగంగా ఉన్న స్థలాలను తక్షణమే గుర్తించాలని అధికారులను సీఎం ఆదేశించారు.
* ప్రత్యామ్నాయ స్థలాల కేటాయింపు..
పోలీస్, రెవెన్యూ, రవాణా తదితర శాఖలకు చెందిన నిరుపయోగ భూములను ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కోసం సేకరించాలని సూచించారు. సదరు శాఖల అవసరాల కోసం ప్రత్యామ్నాయంగా వేరే ప్రాంతాల్లో స్థలాలను కేటాయించాలని ఆదేశించారు.
నిరుపేదలు రోజువారీ జీవనోపాధి కోల్పోకుండా ఉండేందుకే పని ప్రదేశాలకు సమీపంలోనే నివాసాలు కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు.
* ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ వ్యయం మరియు ఫ్లాట్ వివరాలు..
ఫ్లాట్ విస్తీర్ణం: ఒక్కో ఫ్లాట్ దాదాపు 528 చదరపు అడుగుల విస్తీర్ణంతో, 400 చదరపు అడుగుల కార్పెట్ ఏరియాతో నిర్మిస్తారు.
నిర్మాణ వ్యయం: ఒక్కో ఇంటి నిర్మాణానికి దాదాపు రూ. 11 లక్షలు ఖర్చవుతుంది.
ప్రభుత్వ సబ్సిడీ: ప్రభుత్వం ఇందులో రూ. 5 లక్షల వరకు సబ్సిడీని అందిస్తుంది.
లబ్ధిదారుడి వాటా: మిగిలిన రూ. 6 లక్షలు లబ్ధిదారుడి వాటాగా చెల్లించాల్సి ఉంటుంది.
భూమి ఖర్చు: ఇండ్ల నిర్మాణం కోసం అయ్యే భూమి ఖర్చు మొత్తం ప్రభుత్వమే భరిస్తుంది.
తొలి దశలో 17 నియోజకవర్గాల్లో 7,680 ఫ్లాట్లు
హైదరాబాద్ క్యూర్ పరిధిలోని తొలి విడత కింద 17 నియోజకవర్గాల్లో మొత్తం 7,680 ఫ్లాట్లు నిర్మించడానికి ప్రభుత్వం సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేసింది.
* ఎంపిక చేసిన నియోజకవర్గాలు..
రాజేంద్రనగర్, మహేశ్వరం, శేరిలింగంపల్లి, ఇబ్రహీంపట్నం, మల్కాజ్గిరి, నాంపల్లి, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, కార్వాన్, బహదూర్పురా, అంబర్పేట్, కూకట్పల్లి, మేడ్చల్, కుత్బుల్లాపూర్, సనత్నగర్, సికింద్రాబాద్ కంటోన్మెంట్ మరియు మలక్పేట్.
ఈ నియోజకవర్గాల పరిధిలో అర్హులైన నిరుపేదలకు ఇండ్లను కేటాయించేందుకు, ప్రభుత్వ స్థలాల సేకరణ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి అధికారులకు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేశారు.
