NEET Paper Leak Protest by BC Intellectuals Forum, hanamkonda
* నీట్ ప్రశ్నాపత్రం లీకేజీపై బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి
* సంబంధిత మంత్రిని వెంటనే పదవి నుంచి తొలగించాలి – బీసీ ఇంటెలెక్చువల్స్ ఫోరం రాష్ట్ర కార్యదర్శి ప్రొఫెసర్ డా. కూరపాటి రమేష్
అకేరు న్యూస్, హన్మకొండ : దేశవ్యాప్తంగా ఆందోళనకు గురిచేసిన నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంపై సమగ్ర, నిష్పక్షపాత విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని బీసీ ఇంటెలెక్చువల్స్ ఫోరం రాష్ట్ర కార్యదర్శి ప్రొఫెసర్ డా. కూరపాటి రమేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న ప్రవేశ పరీక్షల్లో చోటుచేసుకున్న లోపాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ వ్యవహారానికి నైతిక బాధ్యత వహిస్తూ సంబంధిత మంత్రిని వెంటనే పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.
ప్రజాస్వామ్యంలో ప్రజల గొంతు నొక్కివేయడం రాజకీయాలు కాదని, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన సాగించడమే ప్రభుత్వ ధర్మమని ప్రొఫెసర్ డా. కూరపాటి రమేష్ అన్నారు. ప్రభుత్వం ఎప్పుడూ నాయకుల కోసం కాకుండా ప్రజల కోసం పనిచేసే విధంగా వ్యవహరించాలని సూచించారు.
భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా పరీక్షల నిర్వహణలో పారదర్శకత, భద్రతను మరింత పటిష్టం చేయాలని ఆయన కోరారు. విద్యార్థులు, తల్లిదండ్రుల్లో విశ్వాసాన్ని పునరుద్ధరించేలా NTA వ్యవస్థను యుద్ధ ప్రాతిపదికన రద్దు చేస్తూ UPSC లాంటి స్వయం ప్రతిపత్తి గల కేంద్ర స్థాయి సంస్థను నీట్ ప్రవేశ పరీక్షను నిర్వహించే బాధ్యతను అప్పగించాలని కేంద్ర ప్రభుత్వాన్ని బీసీ ఇంటెలెక్చువల్స్ ఫోరం ఉమ్మడి వరంగల్ జిల్లా కమిటీ డిమాండ్ చేశారు.
ప్రెస్ మీట్ లో డా. కొణతం కృష్ణ, ప్రో. బెనర్జీ రాష్ట్ర వైస్ చైర్మన్, దారం జనార్ధన్, ధనలక్ష్మి, దేవిక, ప్రో. అంజయ్య, కొలిపాక ప్రకాష్, నగేష్, దొమ్మటి ప్రవీణ్ కుమార్, రవితేజ, నిరంజన్ మొదలగు రాష్ట్ర, జిల్లా నాయకులు పాల్గొన్నారు.
