Beeranna Temple Foundation Warangal
* కీర్తినగర్ కాలనీలో వైభవంగా శ్రీ బీరన్న స్వామి దేవాలయ నిర్మాణానికి శంకుస్థాపన
* శాస్త్రోక్తంగా భూమిపూజ నిర్వహించిన ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి
ఆకేరు న్యూస్, వరంగల్:
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (GWMC) 16వ డివిజన్ పరిధిలోని కీర్తినగర్ కాలనీలో కురుమ కులస్తుల ఆరాధ్య దైవమైన శ్రీ బీరన్న స్వామి నూతన దేవాలయ నిర్మాణ పనులకు శనివారం వైభవంగా శంకుస్థాపన జరిగింది. ఈ కార్యక్రమానికి పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై, వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ శాస్త్రోక్తంగా భూమిపూజ నిర్వహించి శంకుస్థాపన చేశారు.
* ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ..
ఆధ్యాత్మికతతోనే మానసిక ప్రశాంతత సిద్ధిస్తుందని, సమాజంలో భక్తిభావాన్ని పెంపొందించడంలో ఆలయాలు ప్రముఖ పాత్ర పోషిస్తాయని అన్నారు. కురుమ సోదరుల ఆరాధ్య దైవమైన వీరన్న స్వామి ఆలయ నిర్మాణానికి తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని హామీ ఇచ్చారు. ఆలయ నిర్మాణ పనులు త్వరగా పూర్తయి, భక్తులకు స్వామివారి దివ్య దర్శనం కలగాలని ఆకాంక్షించారు.
* ఘనంగా స్వాగతం పలికిన కురుమ సంఘం నాయకులు
అంతకుముందు కాలనీకి విచ్చేసిన ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డికి కురుమ సంఘం నాయకులు, కాలనీవాసులు శాలువా, పూలమాలలతో ఘనంగా స్వాగతం పలికారు. ఆలయ శంకుస్థాపన పర్వదినం సందర్భంగా కీర్తినగర్ కాలనీలో పండుగ వాతావరణం నెలకొంది.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కురుమ సంక్షేమ సంఘం నాయకులు, మున్సిపల్ అధికారులు, కీర్తినగర్ కాలనీ ముఖ్య నాయకులు మరియు పెద్ద సంఖ్యలో కురుమ బంధువులు, మహిళలు, భక్తులు పాల్గొన్నారు.
