
ఆకేరున్యూస్, శ్రీహరికోట: సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి పీఎస్ఎల్వీ-సీ59 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. ఈ రాకెట్ ప్రోబా-3 ఉపగ్రహాలను నింగిలోకి మోసుకెళ్లింది. కృత్రిమ సూర్య గ్రహణాన్ని సృష్టించడం ద్వారా భానుడి గుట్టు విప్పేందుకు ఐరోపా అంతరిక్ష సంస్థ (ఈఎస్ఏ)కు చెందిన ప్రోబా-3 మిషన్ శాటిలైట్లను నింగిలోకి పంపింది. కాగా, ఈ ప్రయోగం నిన్ననే చేపట్టాల్సి ఉండగా.. చివరి నిమిషంలో ప్రోబా3 స్పేస్క్రాఫ్ట్లో సాంకేతిక లోపం తలెత్తడంతో ప్రయోగాన్ని ఇస్రో ఇవాళ్టికి వాయిదా వేసింది. ఇస్రో వాణిజ్య విభాగం న్యూస్పేస్ ఇండియా లిమిటెడ్ సహకారంతో ప్రోబా-3ని ప్రయోగించగా.. ప్రోబా-3 మిషన్లో రెండు ఉపగ్రహాలు (కరోనాగ్రాఫ్ స్పేస్క్రాఫ్ట్, ఆక్యుల్టర్ స్పేస్క్రాఫ్ట్) ఉన్నాయి. దాదాపు 550 కిలోల బరువు ఉండే ఈ ఉపగ్రహాలను అతి దీర్ఘవృత్తాకార కక్ష్యలో ప్రవేశపెడతారు. కృత్రిమ గ్రహణాన్ని సృష్టించడం ద్వారా సూర్యుడి బాహ్య వాతావరణమైన కరోనాను అధ్యయనం చేయడమే ప్రోబా-3 లక్ష్యం. ఆ రెండు ఉపగ్రహాలు పరస్పరం సమన్వయం చేసుకుంటూ క్రమపద్ధతిలో భూకక్ష్యలో విహరిస్తాయి. ప్రోబా-3 మిషన్లో ప్రయోగించిన ఉపగ్రహాలు కృత్రిమ సూర్యగ్రహణ పరిస్థితులను సృష్టిస్తాయి. తద్వారా సూర్యుడి బయటి పొర అంటే.. కరోనాను అధ్యయనం చేస్తాయి. ఈ జంట ఉపగ్రహాల్లో ఒక దాంట్లో కరోనాగ్రాఫ్ ఉంటుంది. మరొకటి ఆల్టరర్ కలిగి ఉంటుంది. ఈ ఉపగ్రహాలలో ఒకటి సూర్యుడిని కనిపించకుండా కృత్రిమ గ్రహణం పరిస్థితి సృష్టిస్తే.. మరొకటి కరోనాను నిశితంగా గమనిస్తూ వస్తుంది. ప్రోబా-3 మిషన్ స్పెయిన్, పోలాండ్, బెల్జియం, ఇటలీ, స్విట్జర్లాండ్ శాస్త్రవేత్తల కృషి ఫలితం. మిషన్లో రెండు ఉపగ్రహాలను ఒకేసారి ప్రయోగించారు. ఈ ఉపగ్రహాలు నిర్ణీత కక్ష్యలోకి చేరుకోవడం కీలకం. ఎందుకంటే ఒకదానితో మరొకటి సమన్వయం చేసుకుంటూ కరోనాపై అధ్యయనం చేస్తాయి. ఇందులో ఏ ఒక్కటి పని చేయకపోయినా రెండో శాటిలైట్కు ఉపయోగం లేకుండాపోతుందని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు.
…………………………..