Allu Arjun Court Hearing Today
ఆకేరు న్యూస్, హైదరాబాద్: ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట కేసు విచారణ నేడు నాంపల్లి కోర్టులో జరగనుంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న అందరూ విచారణకు తప్పనిసరిగా హాజరుకావాలని న్యాయస్థానం ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. దీంతో నేడు కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోందనే అంశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
* వర్చువల్గా అల్లు అర్జున్..
గతంలో జరిగిన కోర్టు విచారణకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వర్చువల్గా (వీడియో కాన్ఫరెన్స్ ద్వారా) హాజరయ్యారు. తాజా సమాచారం ప్రకారం.. నేడు జరగబోయే విచారణకు కూడా ఆయన వర్చువల్ విధానంలోనే హాజరయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
* కోర్టు సీరియస్.. ఆ ఇద్దరు వస్తేనే విచారణ
గత విచారణల సమయంలో కేసులోని ఇద్దరు నిందితులు కోర్టుకు హాజరు కాలేదు. దీనిపై న్యాయస్థానం తీవ్రంగా స్పందించింది. ఈ కేసులో మొత్తం 23 మంది నిందితులు ఉన్నారని, వారందరూ కోర్టుకు హాజరైతేనే తదుపరి విచారణ కొనసాగుతుందని గతంలోనే కోర్టు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో, గతంలో గైర్హాజరైన ఇద్దరు నిందితులతో పాటు మిగిలిన వారంతా నేడు కోర్టు ముందుకు వస్తారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. నిందితులందరి హాజరు ఆధారంగానే నేడు నాంపల్లి కోర్టు విచారణను ముందుకు తీసుకెళ్లనుంది.
