IAF AN-32 Aircraft Accident
* అస్సోంలో వాయుసేన విమాన ప్రమాదం
ఆకేరు న్యూస్, డెస్క్: భారత వాయుసేన (IAF) కు చెందిన ఒక రవాణా విమానం శనివారం ఘోర ప్రమాదానికి గురైంది. అస్సోంలోని జోర్హాట్ (Jorhat) ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో ల్యాండ్ అవుతున్న సమయంలో ‘AN-32’ రవాణా విమానం (Transport Aircraft) ప్రమాదానికి గురైనట్లు రక్షణ శాఖ అధికారులు ధృవీకరించారు. రన్వే పై విమానం ల్యాండ్ అయిన వెంటనే ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో ఎయిర్బేస్లో తీవ్ర కలకలం రేగింది.
* ల్యాండింగ్ సమయంలోనే ప్రమాదం..
అధికారిక సమాచారం ప్రకారం ఈ AN-32 కార్గో విమానం వస్తు సామగ్రి, సరఫరాల రవాణా కోసం వినియోగిస్తుంటారు. శనివారం ఉదయం జోర్హాట్ ఎయిర్ఫీల్డ్ (రౌరియా ప్రాంతం) లో రన్వే పై ల్యాండ్ అవ్వడానికి ప్రయత్నిస్తున్న క్రమంలో ఈ ప్రమాదం సంభవించింది. ల్యాండింగ్ సమయంలో ఏదో సాంకేతిక లోపం తలెత్తడం వల్లే విమానంలో మంటలు చెలరేగినట్లు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు.
* యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు…
ప్రమాదం జరిగిన వెంటనే వాయుసేనకు చెందిన అత్యవసర రెస్క్యూ బృందాలు, అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగారు. రన్వే పై విమానానికి పట్టిన మంటలను అదుపు చేసేందుకు శ్రమిస్తున్నారు. అత్యవసర స్పందన బృందాలు (Emergency Response Teams) ఘటనా స్థలంలోనే మొహరించి ఉన్నాయి.
* రక్షణ శాఖ ప్రకటన…
ఈ ఘటనపై డిఫెన్స్ PRO లెఫ్టినెంట్ కల్నల్ M. రావత్ స్పందిస్తూ.. “జోర్హాట్ ఎయిర్ బేస్లో IAF AN-32 విమానం ప్రమాదానికి గురైంది. ప్రమాద తీవ్రత, నష్టాన్ని అంచనా వేస్తున్నాము” అని తెలిపారు.
* పైలట్ పరిస్థితిపై ఆందోళన…
ఈ విమానంలో ఎంతమంది సిబ్బంది ఉన్నారనే దానిపై వాయుసేన ఇంకా అధికారిక సంఖ్యను ప్రకటించలేదు. అయితే ల్యాండింగ్ సమయంలో మంటలు దట్టంగా వ్యాపించడంతో పైలట్ పరిస్థితిపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ ప్రమాదంలో భారీగా నష్టం వాటిల్లి ఉండవచ్చని రక్షణ వర్గాలు భావిస్తున్నాయి.
ఘటన గురించి సమాచారం అందిన వెంటనే వాయుసేనకు చెందిన సీనియర్ అధికారులు జోర్హాట్ ఎయిర్బేస్కు చేరుకున్నారు. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలపై దర్యాప్తుకు ఆదేశించారు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
