BJP MLA Dipesh Sahu Marriage
ఆకేరు న్యూస్, డెస్క్: రాజకీయ నాయకుల పెళ్లిళ్లు అంటేనే కోట్ల రూపాయల ఖర్చు, హంగులు, ఆర్భాటాలు గుర్తుకొస్తాయి. కానీ, ఛత్తీస్గఢ్కు చెందిన ఒక అధికార పార్టీ ఎమ్మెల్యే మాత్రం వీటన్నింటికీ భిన్నంగా నిలిచారు. ఎలాంటి ఆడంబరాలు లేకుండా, అత్యంత సాదాసీదాగా ఓ ప్రభుత్వ సామూహిక వివాహాల పథకంలో పెళ్లి చేసుకుని అందరికీ ఆదర్శంగా నిలిచారు.
* డ్రైవర్ కుమార్తెతో వివాహం..
ఛత్తీస్గఢ్కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే దీపేష్ సాహు ఈ అరుదైన నిర్ణయంతో వార్తల్లో నిలిచారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకమైన ‘ముఖ్యమంత్రి కన్యా వివాహ యోజన’ కింద నిర్వహించిన సామూహిక వివాహాల వేడుకలో ఆయన ఒక డ్రైవర్ కుమార్తెను వివాహం చేసుకున్నారు. సాధారణ పేద ప్రజలతో పాటు తానూ ఒకడిగా నిలిచి వివాహ బంధంలోకి అడుగుపెట్టారు.
* ఎడ్లబండి తోలిన డిప్యూటీ సీఎం..
ఈ వివాహ వేడుకలో మరో ప్రత్యేక ఆకర్షణ ఏమిటంటే.. స్వయంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి (డిప్యూటీ సీఎం) అరుణ్ సావ్ ఎడ్లబండిని నడుపుతూ పెళ్ళికొడుకైన ఎమ్మెల్యే దీపేష్ సాహును ఊరేగింపుగా వివాహ వేదిక వద్దకు తీసుకువచ్చారు. దీనికి సంబంధించిన విజువల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
అనవసర ఖర్చులకు దూరంగా, సామాన్యుల తరహాలోనే ప్రభుత్వ పథకంలో పెళ్లి చేసుకున్న ఎమ్మెల్యే దీపేష్ సాహుపై, అలాగే ఎడ్లబండి తోలి సందడి చేసిన డిప్యూటీ సీఎంపై ప్రస్తుతం నెటిజన్లు, ప్రజల నుండి ప్రశంసల జల్లు కురుస్తోంది. విలాసవంతమైన జీవితానికి ప్రాధాన్యత ఇవ్వకుండా ఆదర్శంగా నిలిచిన ఈ జంటకు పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
