cp Sunpreet Singh Operation Safe School Warangal
* విద్యా సంస్థల పరిసరాల్లో విక్రయిస్తే జైలుకే
– వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్
అకేరు న్యూస్, వరంగల్: వ్యాపారస్తులు ఎవరైనా పాఠశాల, కళాశాల, ఇతర విద్యా సంస్థల పరిసరాల్లో పోగాకు ఉత్పత్తులు విక్రయిస్తే జైలు జీవితం తప్పదని వరంగల్ పోలీస్ కమిషనర్ హెచ్చరించారు.
మరి కొన్ని రోజుల్లో కొత్త విద్యాసంవత్సరం ప్రారంభం కానుంది. ఇప్పటికే ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు రీఓపెనింగ్ సిద్ధమవుతున్నాయి. అయితే, స్కూళ్లు, కాలేజీల పరిసరాల్లోని పాన్ షాపులు, ఇతర దుకాణాలు స్టూడెంట్లను చెడు అలవాట్ల వైపు మళ్లిస్తున్నాయనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
గుట్కా, సిగరెట్లు తదితర పొగాకు ఉత్పత్తులను విక్రయించడం ద్వారా విద్యార్థులు మాదక ద్రవ్యాలకు అలవాటు పడే ప్రమాదం ఉందని పోలీసులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వరంగల్ కమిషనరేట్ పరిధిలో ‘ఆపరేషన్ సేఫ్ స్కూల్’ పేరుతో విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు.
మైనర్లు, స్కూల్ స్టూడెంట్లకు గుట్కా, సిగరెట్లు వంటి పొగాకు ఉత్పత్తులు అమ్మకుండా విద్యాసంస్థల సమీపంలోని పాన్ షాపులు, ఇతర దుకాణాలను తనిఖీ చేస్తున్నారు. కొత్త విద్యాసంవత్సరం ప్రారంభమయ్యే నాటికి స్కూళ్లు, కాలేజీల పరిసరాలను టొబాకో ఫ్రీ జోన్లుగా మార్చేందుకు వరంగల్ పోలీస్ కమిషనర్ ఆధ్వర్యంలో పోలీసులు చర్యలు తీసుకొనేందుకు సిద్ధమాయ్యారు.
ఇందులో భాగంగా విద్యా సంస్థ పరిసరాల్లో పోగాకు ఉత్పత్తులను నిషేధమని తెలియజేస్తూ రూపొందించిన గోడ పత్రికను వరంగల్ పోలీస్ కమిషనర్ ఆవిష్కరించారు. ఈ సందర్బంగా పోలీస్ కమిషనర్ విద్యార్థుల భవిష్యత్తును కాపాడాల్సిన బాధ్యత మనందరిపై ఉందని , ముఖ్యంగా విద్యార్థులు చెడు అలవాట్లకు బానిసలుగా మారకుండా చేపడుతున్న చర్యల్లో భాగంగా విద్యా సంస్థ పరిసరాల్లో పోగాకు విక్రయాలు నిషేదించబడ్డాయని, ఎవరైనా విద్యా సంస్థల వద్ద విక్రయాలకు పాల్పడితే సిగిరెట్ అండ్ ఆదర్ టాబాకో ప్రొడక్ట్స్ – 2003 యాక్ట్ క్రింద చర్యలు తీసుకోబడుతాయని, అలాగే మైనర్లకు కూడా పోగాకు ఉత్పత్తులు విక్రయిస్తే జస్టిస్ జువైనల్ యాక్ట్ 2015 యాక్ట్ 77 ప్రకారం చట్ట పరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు.
ఎవరైన విద్యా సంస్థల వద్ద పోగాకు ఉత్పత్తులను విక్రయిస్తే స్థానిక పోలీసులకు లేదా డయల్ 100 ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గొప్యంగా ఉంచబడుతాయని పోలీస్ కమిషనర్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ జితేందర్ రెడ్డి, సి సి ఆర్ బి ఏసీపీ డేవిడ్ రాజు, వరంగల్ ట్రాఫిక్ ఇన్స్ స్పెక్టర్ సుజాత, ఏ. ఎస్. ఐ రాజేందర్ ప్రసాద్ పాల్గొన్నారు.
