*మేడారం ఘటనపై జాతీయ మహిళా కమిషన్ సీరియస్
*రంగంలోకి విచారణ కమిటీ
ఆకేరు న్యూస్, మేడారం: ములుగు జిల్లా మేడారంలో సమ్మక్క-సారలమ్మ జాతర కొనసాగుతున్న వేళ, వెలుగులోకి వచ్చిన ఓ అమానుష ఘటనపై జాతీయ మహిళా కమిషన్ (NCW) తీవ్రంగా స్పందించింది. ఛత్తీస్గఢ్కు చెందిన ఐదుగురు యువకులు ఒక మైనర్ బాలికపై సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారంటూ సోషల్ మీడియా మరియు వివిధ వార్తా సంస్థల్లో వస్తున్న కథనాలను కమిషన్ సుమోటోగా స్వీకరించింది.ఈ ఘటనపై వస్తున్న వార్తలను తీవ్రంగా పరిగణించిన జాతీయ మహిళా కమిషన్ చైర్మన్ విజయా రాహత్కర్, తక్షణమే విచారణ చేపట్టాలని ఆదేశించారు. భక్తులతో కిక్కిరిసిపోయే జాతర ప్రాంగణంలో ఇలాంటి ఘటన జరగడం పట్ల కమిషన్ విస్మయం వ్యక్తం చేసింది. వాస్తవాలను వెలికితీసేందుకు ప్రత్యేక కమిటీని రంగంలోకి దించింది.ఈ దారుణంపై పూర్తిస్థాయి నివేదికను రూపొందించేందుకు NCW ఒక విచారణ కమిటీని ఏర్పాటు చేసింది.కమిటీ చైర్మన్ NCW సభ్యురాలు డెలినా , సభ్యురాలు కంచన్ కట్టర్ఈ కమిటీ గురువారం నుంచే తన విచారణను ప్రారంభించనుంది. బాధితురాలి వివరాలు, నిందితుల ఆచూకీ మరియు స్థానిక పోలీసుల చర్యలపై ఈ బృందం క్షేత్రస్థాయిలో పర్యటించి వివరాలు సేకరించనుంది.సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సమాచారం ప్రకారం.. ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన ఐదుగురు యువకులు ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది. జాతరలో కట్టుదిట్టమైన భద్రత ఉందని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, ఇలాంటి ఘటనలు జరగడం భక్తుల్లో ఆందోళన కలిగిస్తోంది. విచారణ అనంతరం కమిటీ తన నివేదికను కేంద్రానికి సమర్పించనుంది.

