ఒడిశా విద్యార్థిని అద్భుత ఆవిష్కరణ!
ఆకేరు న్యూస్,డెస్క్:’సైలెంట్ హార్ట్ ఎటాక్’ వల్ల ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఇలాంటి విపత్కర పరిస్థితుల నుండి సామాన్యులను కాపాడేందుకు ఒడిశాకు చెందిన ఓ విద్యార్థిని అద్భుతమైన సాంకేతికతను అందుబాటులోకి తెచ్చారు.కటక్ లోని ప్రసిద్ధ రావెన్ షా విశ్వవిద్యాలయంలో ఐటీ విభాగంలో మూడవ సంవత్సరం చదువుతున్న దేబాశ్రితా దాస్, వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చేలా ఒక పరికరాన్ని రూపొందించారు. కృత్రిమ మేధ (AI) ఆధారంగా పనిచేసే ఈ పరికరం గుండె ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షిస్తుంది. గుండెపోటు రావడానికి 30 నిమిషాల ముందే రోగిని మరియు వారి కుటుంబ సభ్యులను అప్రమత్తం చేస్తుంది.ఈ అర గంట సమయం రోగికి అత్యవసర వైద్యం అందించడానికి (Golden Hour)ఎంతో కీలకంగా మారుతుంది.ఈ ప్రాజెక్ట్ యొక్క ప్రాముఖ్యతను గుర్తించిన ఐఐటీ బాంబే (IIT Bombay)వారు దీనికి అవసరమైన సాంకేతిక సహకారాన్ని అందించారు. ఈ పరికరాన్ని పూర్తిస్థాయిలో మార్కెట్లోకి తీసుకురావడానికి మరో 6 లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుందని దేబాశ్రితా తెలిపారు.ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఖరీదైన హృద్రోగ పరీక్షా పరికరాలతో పోలిస్తే, దీని ధర సామాన్యులకు అందుబాటులో ఉండాలని ఆమె ఆకాంక్షిస్తున్నారు. మార్కెట్లోకి విడుదలయ్యాక దీని ధర సుమారు 25,000 రూపాయల వరకు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.
