MLA Yashaswini Reddy Blesses Children
* చిన్నారుల తొలి జన్మదిన వేడుకల్లో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి
ఆకేరు న్యూస్.తొర్రూర్: మండలంలోని వెంకటాపురం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు కొయ్యడి ప్రవీణ్ – భవాని దంపతుల కుమారుడు, కుమార్తె తొలి జన్మదిన వేడుకలు కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో ఘనంగా నిర్వహించగా, ఈ వేడుకలకు పాలకుర్తి శాసనసభ్యురాలు యశస్విని రెడ్డి గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారు చిన్నారులతో కలిసి కేక్ కట్ చేయించి, వారికి ఆశీస్సులు అందించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. చిన్నారులు ఆయురారోగ్యాలతో, విద్యా విజ్ఞానాలతో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, కుటుంబానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.
అనంతరం కొయ్యడి ప్రవీణ్–భవాని దంపతులతో పాటు కుటుంబ సభ్యులను ఆప్యాయంగా పలకరించిన ఎమ్మెల్యే, ఇలాంటి శుభ సందర్భాలు కుటుంబ బంధాలను మరింత బలోపేతం చేస్తాయని పేర్కొన్నారు. ప్రజలతో ఆత్మీయ అనుబంధమే తనకు అతిపెద్ద బలమని, వారి సంతోషాల్లోనూ, కష్టసుఖాల్లోనూ ఎల్లప్పుడూ భాగస్వామిగా ఉంటానని అన్నారు.
ఈ సందర్భంగా కొయ్యడి ప్రవీణ్ కుటుంబ సభ్యులు తమ ఆహ్వానాన్ని మన్నించి వేడుకకు విచ్చేసి చిన్నారులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు మరియు గ్రామస్థులు పాల్గొన్నారు.
