National Lok Adalat Warangal
* న్యాయవాదులు కేసులను త్వరితగతిన పరిష్కరానికి సువర్ణావకాశం – న్యాయమూర్తులు
ఆకేరు న్యూస్, హన్మకొండ: జాతీయ లోక్ అదాలత్ ద్వారా న్యాయవాదులు కేసుల త్వరితగతిన పరిష్కరానికి సువర్ణావకాశమని వరంగల్, హన్మకొండ జిల్లాల న్యాయమూర్తులు బి వి నిర్మలా గీతాంబ, యం రామకృష్ణ సునిత పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా నిర్వహించబడుతున్న 2వ జాతీయ లోక్ అదాలత్ శనివారం వరంగల్, హన్మకొండ జిల్లా కోర్టు ప్రాంగణంలో ఘనంగా ప్రారంభమైంది. ఉదయం 09:30 గంటలకు కోర్టు ప్రాంగణంలోని 10వ కోర్టుల భవనంలో గల కాన్ఫరెన్స్ హాల్ లో వరంగల్, హన్మకొండ జిల్లాల గౌరవ ప్రధాన న్యాయమూర్తులు బి.వి.నిర్మలా గీతాంబ మరియు యం.రామకృష్ణ సునీత లు జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించారు.
జాతీయ లోక్ అదాలత్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మరియు ప్రతినిధులుగా వెస్ట్ జోన్ డీసీపీ , ఉభయ జిల్లాల గౌరవ న్యాయమూర్తులు,
వరంగల్, హనుమకొండ న్యాయవాదుల సంఘం అధ్యక్షులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, వివిధ బ్యాంకుల మేనేజర్లు మరియు పలువురు ప్రముఖులు హాజరయ్యారు.
లోక్ అదాలత్ ద్వారా కోర్టుల్లో సుదీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న సివిల్, కాంపౌండబుల్ క్రిమినల్ కేసులు, బ్యాంక్ రికవరీ కేసులు, మరియు ప్రీ-లిటిగేషన్ కేసులను ఇరుపక్షాల అంగీకారంతో, సామరస్యపూర్వకంగా త్వరితగతిన పరిష్కరించుకోవడానికి ఇదొక సువర్ణావకాశమని న్యాయమూర్తులు ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ సేవలను ప్రజలు, కక్షిదారులు వినియోగించుకోవాలన్నారు.
