*విధి నిర్వహణలో ఉన్న కానిస్టేబుల్ గుండెపోటుతో మృతి…
ఆకేరు న్యూస్,మంచిర్యాల:పోలీస్ శాఖలో తీవ్ర విషాదం నెలకొంది. కానిస్టేబుల్ ముష్కే వెంకటేష్ (45) కన్నుమూశారు. బుధవారం రాత్రి ఆయనకు గుండెపోటు రావడంతో తుదిశ్వాస విడిచారు.బెల్లంపల్లికి చెందిన వెంకటేష్ గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. మెరుగైన వైద్యం కోసం ఆయన హైదరాబాద్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. అక్కడ చికిత్స పొందుతున్న క్రమంలో బుధవారం రాత్రి పరిస్థితి విషమించడంతో గుండెపోటుతో మరణించినట్లు సమాచారం. వెంకటేష్ గతంలో బెల్లంపల్లి తాళ్ల గురజాల పోలీస్ స్టేషన్లో కోర్ట్ కానిస్టేబుల్గా సేవలందించారు. ప్రస్తుతం ఆయన మాదారం పోలీస్ స్టేషన్లో విధులు నిర్వర్తిస్తున్నారు. అకాల మరణం పట్ల తోటి ఉద్యోగులు, ఉన్నతాధికారులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వెంకటేష్ మరణవార్త తెలియగానే బెల్లంపల్లిలోని ఆయన నివాసం వద్ద విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయన కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
