* తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పశుసంవర్థక శాఖ ముఖ్యకార్యదర్శి సబ్యసాచి ఘోష్
ఆకేరు న్యూస్, హైదరాబాద్: తెలంగాణ పశుసంవర్థక శాఖకు చెందిన విజయ డైరీ సంస్థ తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీకి సమర్పించే నైవేద్యాల కోసం స్వచ్ఛమైన, నాణ్యమైన ఉత్పత్తులను సరఫరా చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వ పశుసంవర్థక శాఖ ముఖ్యకార్యదర్శి సబ్యసాచి ఘోష్ తెలిపారు. ఈ మేరకు ఆయన టీటీడీ కార్యనిర్వహణ అధికారి జె.శ్యామలరావుకు శనివారం లేఖ ద్వారా తెలియజేశారు. దేశ వ్యాప్తంగా పాలు, పాల ఉత్పత్తుల రంగంలో తెంలగాణ విజయ డైరీ సంస్థ ప్రసిద్ధి చెందినదని, వినియోగదారులకు విలువైన, నాణ్యమైన ఉత్పత్తులను సరఫరా చేసిన చరిత్రను కలిగి ఉందని ఆ లేఖలో పేర్కొన్నారు. విజయ డైరీ ఉత్పత్తులలో నాణ్యతను నిర్ధారించడంతో పాటు, లక్షలాది మంది పాల రైతుల జీవనోపాధికి సంస్థ తోడ్పడుతుందని ఆయన తెలిపారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి అధిక నాణ్యత గల నెయ్యి, ఇతర పాల ఉత్పత్తుల అవసరాలన్నింటినీ తీర్చడానికి విజయ డైరీ సంస్థ సన్నద్దతను తెలియజేశారు. విజయ డైరీ ప్రభుత్వ సంస్థ అయినందున సరఫరాల స్వచ్ఛత, నాణ్యత, ధరల విషయంలో పూర్తి పారదర్శకంగా ఉంటుందని ఆయన తెలిపారు. దేవస్థానానికి, భక్తులకు సేవ చేసే అవకాశం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వ పశుసంవర్థక శాఖ ముఖ్యకార్యదర్శి సబ్యసాచి ఘోష్ టీటీడీ కార్యనిర్వహణ అధికారిని కోరారు.
………………….
Please tell us what is wrong. Your report will be sent to the website team.
