Public Examinations Amendment Bill 2026
* పేపర్ లీక్లకు చెక్ పెట్టేలా కొత్త చట్ట సవరణలు…
ఆకేరు న్యూస్, డెస్క్: దేశ వ్యాప్తంగా వరుసగా జరుగుతున్న పోటీ పరీక్షల పేపర్ లీకేజీలు, పరీక్షల నిర్వహణలో జరుగుతున్న అక్రమాలకు శాశ్వతంగా చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం అత్యంత కఠినమైన చర్యలకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ‘పబ్లిక్ పరీక్షల అక్రమాల నిరోధక సవరణ బిల్లు-2026’ ను సోమవారం లోక్సభ ముందుకు తీసుకురానుంది. నిరుద్యోగ యువత భవిష్యత్తుతో ఆడుకునే లీకేజీ ముఠాలు, అక్రమార్కులపై ఉక్కుపాదం మోపేలా ఈ కొత్త చట్టంలో సవరణలు ప్రతిపాదించారు.
సాధారణ అక్రమాలకు పాల్పడే వారికి ఇచ్చే జైలుశిక్షను 5 సంవత్సరాల నుంచి ఏకంగా 10 ఏళ్లకు పెంచుతూ చట్ట సవరణ చేశారు. సాధారణ అక్రమాలకు పాల్పడితే రూ. 50 లక్షల వరకు జరిమానా విధించనున్నారు. పేపర్ లీకేజీలకు పాల్పడే వ్యవస్థీకృత ముఠాలకు (Paper Leak Gangs) ఏకంగా రూ. 10 కోట్ల వరకు ఫైన్ వసూలు చేస్తారు.
పరీక్షల నిర్వహణ బాధ్యతలు చేపట్టే ‘ఎగ్జామ్ సర్వీస్ ప్రొవైడర్ల’ (Exam Service Providers) నిర్లక్ష్యం లేదా అక్రమాలు రుజువైతే రూ. 5 కోట్ల జరిమానా విధించనున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన ప్రైవేట్ ఏజెన్సీలు, పరీక్షా కేంద్రాలు మరియు బోర్డులపై 8 ఏళ్ల పాటు నిషేధం (బ్లాక్లిస్ట్) విధిస్తారు. కేసుల విచారణను వేగవంతం చేసేందుకు ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయనున్నారు. దర్యాప్తు వేగంగా పూర్తయి ఛార్జ్షీట్ దాఖలు చేసిన 3 నెలల లోపే తీర్పును వెలువరించడం లక్ష్యంగా ఈ కొత్త నిబంధనలను రూపొందించారు.
