Mahabubabad family tragedy children death
*కుటుంబ కలహాల సెగ
*పిల్లలను చంపి తండ్రి ఆత్మహత్య
ఆకేరు న్యూస్, మహబూబాబాద్ జిల్లా: జిల్లాలోని తొర్రూరు మండల కేంద్రంలో హృదయవిదారక సంఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాలు మూడు నిండు ప్రాణాలను బలితీసుకున్నాయి. అభం శుభం తెలియని ఇద్దరు చిన్నారులను కన్న తండ్రే స్వయంగా హతమార్చి, అనంతరం తాను కూడా ఆత్మహత్యకు పాల్పడటం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
అమ్మపురం గ్రామానికి చెందిన కిన్నెర గుమ్ షావలి (35) అనే వ్యక్తికి, అతని భార్యకు మధ్య కొంతకాలంగా కుటుంబ పరమైన గొడవలు జరుగుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలో మనస్తాపానికి గురైన షావలి, మంగళవారం తొర్రూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ సమీపంలోని నిర్మానుష్య ప్రాంతానికి తన ఇద్దరు కుమారులు విలష్ (5), వికేష్ (3)లను తీసుకెళ్లాడు. అక్కడ చెట్టుకు ఉరివేసి చిన్నారులను కిరాతకంగా హతమార్చాడు. అనంతరం అదే చెట్టుకు తాను కూడా ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
*కన్నీరుమున్నీరవుతున్న బంధువులు:
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. విగతజీవులుగా పడి ఉన్న పసికందులను చూసి స్థానికులు, బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు. తండ్రి చేసిన పనికి ఆ చిన్నారులు ఏం పాపం చేశారంటూ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
