Lyricist Chandrabose brother Rajender death
* మిస్టరీగా మారిన రాజేందర్ మరణం
ఆకేరు న్యూస్, హైదరాబాద్: ప్రముఖ సినీ గేయ రచయిత, ఆస్కార్ విజేత చంద్రబోస్ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన సోదరుడు రాజేందర్ (60) అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. రాజేందర్ మియాపూర్-2 డిపోలో కండక్టర్గా పనిచేస్తున్నారు.
రాజేందర్ మృతదేహం అన్నమయ్య జిల్లాలో లభ్యమవ్వడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఆయన మరణవార్తను అక్కడి పోలీసులు కుటుంబ సభ్యులకు చేరవేశారు. వృత్తిరీత్యా కండక్టర్ అయిన రాజేందర్, కొంతకాలంగా రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కూడా భాగస్వామిగా ఉన్నట్లు సమాచారం. ఈ వ్యాపార లావాదేవీలే ఆయన మరణానికి కారణమా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.
* పోలీసుల దర్యాప్తు
రాజేందర్ అదృశ్యంపై తొలుత హైదరాబాద్లోని దుండిగల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. అయితే మృతదేహం అన్నమయ్య జిల్లాలో లభించడంతో, దుండిగల్ పోలీసులు దీనిని ‘జీరో ఎఫ్ఐఆర్’ (Zero FIR) గా నమోదు చేసి, తదుపరి విచారణ నిమిత్తం కేసును అన్నమయ్య జిల్లా పోలీసులకు బదిలీ చేశారు.
ప్రస్తుతం మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి చేసి హైదరాబాద్కు తరలించారు. ఇది గుండెపోటుతో సంభవించిన మరణమా లేక మరేదైనా కారణం ఉందా అన్నది పోస్టుమార్టం నివేదికలో తేలనుంది. పోలీసులు అన్ని కోణాల్లోనూ దర్యాప్తును ముమ్మరం చేశారు.
