
ఇబ్బంది పడుతున్న వాహనదారులు, ప్రజలు
ఆకేరు న్యూస్ , కమలాపూర్ : ఉప్పల్ – జమ్మికుంట రైల్వే స్టేషన్ ల మధ్య ఉన్న 14T రైల్వేగేటును ఓవర్ హాల్టింగ్ నిర్మాణ పనుల నిమిత్తం ఈ నెల 8, 9 తేదీల్లో రెండు రోజుల పాటు తాత్కాలికంగా మూసి వేస్తున్నామని కాజీపేట సీనియర్ సెక్షన్ ఇంజినీర్ ఓ ప్రకటనలో తెలిపారు. పరకాల – హుజురాబాద్ మార్గంలోని రైల్వే గేట్ కావటంతో ప్రయాణికులు ఇబ్బంది పడకుండా వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలలో ప్రయాణించాలన్నారు. రెవెన్యూ తదితర శాఖల అధికారులు ప్రజలను, వాహనదారులను ప్రత్యామ్నాయ మార్గాలలో వెళ్లేలా చైతన్యపర్చాలని రైల్వే అధికారులు కోరారు.

ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు..
హుజురాబాద్ – పరకాల మార్గంలో గల ఏకైక రైల్వే గేట్ మూసివేతతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. నిత్యం ఈ మార్గంలో వాహనదారుల రద్దీ అధికంగా ఉంటుంది. ఈ మార్గంలో నడిచే బస్సు సర్వీసులు కూడా ఉప్పల్ గేటు వరకే పరిమితమయ్యాయి. ప్రయాణికులు కాలినడకన గేటు దాటి తర్వాత గేటు అవతలి పక్క వారి ప్రయాణాన్ని పూర్తి చేయడానికి వాహనాల కోసం నిరీక్షించాల్సి వస్తుంది.
