Blood donation saves lives
* జిల్లా కలెక్టర్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా ఛైర్మన్ దివాకర టి.ఎస్.
ఆకేరు న్యూస్, ములుగు:
రక్తదానం చేయడం ద్వారా నిండు ప్రాణాలను కాపాడవచ్చని, రక్తదాతల సేవ స్ఫూర్తి ప్రశంసా నియమని జిల్లా కలెక్టర్ దివాకర్ టి.ఎస్. అన్నారు.
శనివారం ములుగు జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ -టి జి ఓ అసోసియేషన్, టీఎన్జీవో యూనియన్ సంయుక్త ఆధ్వర్యంలో ములుగు గట్టమ్మ దేవాలయ సమీపంలోని ఆర్ అండ్ బీ అతిథి గృహంలో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరం కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ సందర్శించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మనం ఇచ్చే ప్రతి రక్తపు బొట్టు ఒక నిండు ప్రాణాన్ని నిలబెడుతుందని, రక్తదానం అనేది కేవలం ఒక కార్యక్రమంగా చూడకూడదని, అది ఒక గొప్ప సామాజిక సంస్కృతిగా మారాలని ఉద్ఘాటించారు. జీవితాలను కాపాడే మహత్తర సేవలో భాగంగా ప్రతి ఆరోగ్యవంతుడు స్వచ్ఛందంగా రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు. రక్తం అందుబాటులో ఉండడం అత్యవసర చికిత్స లలో ఎంతో కీలకమని, ముఖ్యంగా ప్రమాదాలు, శస్త్రచికిత్సలు, అత్యవసర వైద్య సేవల సమయంలో రక్తదానం ప్రాణదాతగా నిలుస్తుందని అన్నారు.
జిల్లాలోని ప్రజలు,ఉద్యోగులు, ఉపాధ్యాయులు,యువత, పెద్ద సంఖ్యలో స్వచ్ఛందంగా తరలివచ్చి రక్తదానం చేశారు.అనంతరం రక్తదానం చేసిన వారికి కలెక్టర్ ప్రశంసా పత్రాలు అందజేశారు.
అదనపు కలెక్టర్లు సి హెచ్ మహేందర్ జి, సంపత్ రావులు రక్తదానం చేసి ఉద్యోగులకు, దాతలకు స్ఫూర్తిగా నిలిచారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు సి హెచ్ మహేందర్ జి, సంపత్ రావు, డి ఆర్ డి ఓ చంద్రశేఖర్, అడిషనల్ ఆర్డిఓ శ్రీనివాస్, ఉద్యోగ సంఘ ప్రతినిధులు, ములుగు జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ పాలకమండలి సభ్యులు సతీష్, రాజిరెడ్డి, రమేష్ లతో యువత, వైద్య బృందం, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
