Telegram Ban India
ఆకేరు న్యూస్, డెస్క్: దేశంలో మెసేజింగ్ యాప్ ‘టెలిగ్రామ్’ (Telegram) సేవలపై కేంద్ర ప్రభుత్వం తాత్కాలిక నిషేధం విధించింది. జూన్ 21న జరగనున్న నీట్ యూజీ (NEET UG 2026) రీ-ఎగ్జామినేషన్ నేపథ్యంలో కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ (MeitY) ఈ సంచలన నిర్ణయం తీసుకుంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) చేసిన సిఫార్సుల మేరకు, ఐటీ చట్టం 2000లోని సెక్షన్ 69A కింద టెలిగ్రామ్ యాక్సెస్ను జూన్ 22 వరకు భారత్లో తాత్కాలికంగా బ్లాక్ చేశారు.
* జూన్ 30 వరకు మెసేజ్ ఎడిటింగ్ ఫీచర్ కట్..
యాప్ బ్లాకింగ్తో పాటు టెలిగ్రామ్లోని మరో కీలక ఫీచర్పై కూడా కేంద్రం కోరడా ఝుళిపించింది. ఇప్పటికే పోస్ట్ చేసిన మెసేజ్లను ఎడిట్ చేసే ‘మెసేజ్ ఎడిటింగ్’ ఫీచర్ను జూన్ 30 వరకు భారత్లో డిసేబుల్ చేయాలని టెలిగ్రామ్ సంస్థను ఆదేశించింది.
* బ్యాన్ చేయడానికి కారణం…
ఇటీవల కాలంలో పరీక్షల పేపర్ లీకేజీ ముఠాలు, సైబర్ కేటుగాళ్లు టెలిగ్రామ్ను వేదికగా చేసుకుని భారీ మోసాలకు పాల్పడుతున్నట్లు ఎన్టీఏ (NTA) గుర్తించింది. ముఖ్యంగా టెలిగ్రామ్లోని ‘ఎడిట్’ ఫీచర్ను అడ్డం పెట్టుకుని కొంతమంది కేటుగాళ్లు ‘టైమ్స్టాంప్ ఫ్రాడ్’ (Timestamp Fraud)కు పాల్పడుతున్నారు.
పరీక్ష ముగిసిన తర్వాత పాత పోస్టులను ఎడిట్ చేసి, అందులో అసలైన ప్రశ్నపత్రాన్ని పెడుతున్నారు. దీనివల్ల పరీక్షకు ముందే పేపర్ లీక్ అయినట్లు భ్రమలు కల్పించి, విద్యార్థులను, తల్లిదండ్రులను మోసం చేస్తున్నారు. ఈ విధమైన నకిలీ లీకేజీ వార్తలు, పుకార్ల వల్ల పబ్లిక్ ఆర్డర్ దెబ్బతినకుండా ఉండేందుకే ప్రభుత్వం ఈ కఠిన చర్యలు చేపట్టింది.
* ఎన్టీఏ క్లారిటీ..
టెలిగ్రామ్పై తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఎన్టీఏ స్వాగతించింది. కేవలం పరీక్షల పారదర్శకతను కాపాడటానికి, మోసగాళ్ల బారిన విద్యార్థులు పడకుండా ఉండటానికే ఈ తాత్కాలిక ఆంక్షలు విధించినట్లు స్పష్టం చేసింది. జూన్ 21న జరగబోయే నీట్ యూజీ రీ-ఎగ్జామ్ను ఎలాంటి అవాంతరాలు లేకుండా, అత్యంత పారదర్శకంగా నిర్వహిస్తామని కేంద్రం భరోసా ఇచ్చింది.
ప్రస్తుతం ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (I4C)తో పాటు పలు రాష్ట్రాల సైబర్ క్రైమ్ పోలీసులు టెలిగ్రామ్లో నకిలీ పేపర్లు అమ్ముతున్న గ్రూపులు, ఛానళ్లపై నిఘా పెట్టి, నిందితులను అరెస్ట్ చేస్తున్నారు.
