Voter List Revision Process
ఆకేరు న్యూస్, డెస్క్: దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితాను పక్కాగా రూపొందించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం నడుం బిగించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా 16 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో మే 30 నుంచి ఓటర్ల జాబితా ‘ప్రత్యేక విస్తృత సవరణ’ (Special Summary Revision – SSR) ప్రక్రియను ప్రారంభించనున్నట్లు ఈసీ గురువారం కీలక ప్రకటన చేసింది.
* ఇంటింటికీ అధికారులు..
ఈ భారీ క్రతువులో భాగంగా మూడవ దశలో దాదాపు 3.94 లక్షల మందికి పైగా బూత్ స్థాయి అధికారులు (BLOలు) రంగంలోకి దిగనున్నారు. వీరు సుమారు 36.73 కోట్ల మంది ఓటర్ల ఇళ్లకు నేరుగా వెళ్లి వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తారు. ఓటర్ల జాబితాలో తప్పుల సరిదిద్దడం, చనిపోయిన వారి పేర్ల తొలగింపు, చిరునామా మార్పులు మరియు కొత్త ఓటర్ల నమోదు వంటి పనులను ఈ సందర్భంగా చేపడతారు.
* ప్రక్రియ ప్రారంభం కానున్న రాష్ట్రాలు/యూటీలు ఇవే…
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ, ఒడిశా, మిజోరం, సిక్కిం, మణిపూర్, ఉత్తరాఖండ్, అరుణాచల్ ప్రదేశ్, హర్యానా, చండీగఢ్, పంజాబ్, కర్ణాటక, మేఘాలయ, మహారాష్ట్ర, జార్ఖండ్, నాగాలాండ్, త్రిపుర, దాద్రా నగర్ హవేలి మరియు డామన్ డయ్యూ.
* వాతావరణ పరిస్థితుల దృష్ట్యా వాయిదా…
హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, లడఖ్ వంటి మంచు ప్రభావిత ప్రాంతాల్లో ప్రస్తుత వాతావరణ పరిస్థితుల వల్ల ఈ ప్రక్రియను ఇప్పుడు నిర్వహించడం లేదు. అక్కడ షెడ్యూల్ను తదుపరి తేదీల్లో ప్రకటిస్తామని ఈసీ తెలిపింది.
* మిగిలిన రాష్ట్రాల పరిస్థితి ఏంటి..
ఇప్పటికే ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, తమిళనాడు, కేరళ వంటి కీలక రాష్ట్రాల్లో ఈ సవరణ ప్రక్రియ పూర్తయ్యింది. అస్సాంలో మాత్రం నియోజకవర్గాల పునర్విభజన నేపథ్యంలో ఒక ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు అధికారులు వెల్లడించారు.
* ఓటర్లకు విన్నపం….
మీ ఓటు హక్కును కాపాడుకోవడానికి, మీ వివరాల్లో ఏవైనా తప్పులు ఉంటే సరిచేయించుకోవడానికి మీ ఇంటికి వచ్చే BLOలకు సహకరించాలని ఎన్నికల సంఘం కోరుతోంది.
ALSO READ :
