Warangal Uncle Murder Case
* వరంగల్ జిల్లాలో విషాదం
ఆకేరు న్యూస్, వరంగల్ :
దుగ్గొండి మండలం నాచినపల్లి గ్రామంలో శుక్రవారం అర్ధరాత్రి తీవ్ర ఉద్రిక్తత, విషాద ఘటన చోటుచేసుకుంది. మద్యం మత్తులో ఉన్న ఓ యువకుడు తన బాబాయిపై విచక్షణారహితంగా కర్రతో దాడి చేసి పొట్టనబెట్టుకున్నాడు.
నాచినపల్లి గ్రామానికి చెందిన ముస్కల సాంబరెడ్డి మానసిక వికలాంగుడు. శుక్రవారం అర్ధరాత్రి సమయంలో సాంబరెడ్డిపై అతని అన్న కుమారుడైన ముస్కల రాజు మద్యం మత్తులో ఘర్షణకు దిగాడు. ఇద్దరి మద్య మాటా,మాటా పెరిగింది..ఆగ్రహంతో ఊగిపోయిన రాజు, చేతికి అందిన కర్రతో సాంబరెడ్డిపై తీవ్రంగా దాడి చేశాడు.
ఈ దాడిలో సాంబరెడ్డికి తీవ్ర గాయాలై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. కుటుంబ కలహాలా లేక ఇతర ఏమైనా కారణాలు ఉన్నాయా అనే కోణంలో స్థానికంగా చర్చ జరుగుతోంది.సమాచారం అందుకున్న వెంటనే దుగ్గొండి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.
నిందితుడు ముస్కల రాజుపై హత్య కేసు నమోదు చేసి, దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ ఘటనతో నాచినపల్లి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
