Warangal Fake Pension GWMC Drive
* యాప్తో ముఖం చూపిస్తేనే పింఛన్
ఆకేరు న్యూస్, వరంగల్: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (GWMC) పరిధిలో సామాజిక భద్రత పింఛన్ల పంపిణీలో జరుగుతున్న అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు అధికారులు కఠిన చర్యలకు ఉపక్రమించారు. అనర్హులు, బోగస్ లబ్ధిదారులను ఏరివేసే లక్ష్యంతో కార్పొరేషన్ పరిధిలో ఒక ప్రత్యేక డ్రైవ్ను ప్రారంభించారు.
* చనిపోయిన వారి పేర్లపైనా పింఛన్ల డ్రా…
ఇటీవల జరిపిన ప్రాథమిక పరిశీలనలో దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. GWMC పరిధిలో ఇప్పటికే మరణించిన లబ్ధిదారుల పేర్లను వాడుకుంటూ కొందరు అక్రమార్కులు నెలనెలా పింఛన్ డబ్బులను డ్రా చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ముఖ్యంగా బ్యాంకుల ద్వారా నేరుగా ఖాతాల్లో జమ అవుతున్న పింఛన్లలోనే ఈ తరహా అక్రమాలు ఎక్కువగా జరుగుతున్నట్లు విచారణలో తేలింది.
* ‘లైవ్నెస్ అథెంటికేషన్’ యాప్తో చెక్…
ఈ అక్రమాలకు శాశ్వతంగా చెక్ పెట్టేందుకు మున్సిపల్ యంత్రాంగం సరికొత్త టెక్నాలజీని వాడుతోంది. ఇకపై లబ్ధిదారులు బతికే ఉన్నారా లేదా అని నిర్ధారించుకోవడానికి ‘లైవ్నెస్ అథెంటికేషన్ యాప్’ (Liveness Authentication App) ద్వారా ‘ముఖ గుర్తింపు’ (Face Recognition) విధానాన్ని అమలు చేయనున్నారు. ఈ యాప్ ద్వారా లబ్ధిదారుడి ముఖాన్ని ప్రత్యక్షంగా స్కాన్ చేసిన తర్వాతే పింఛన్ మంజూరు అవుతుంది.
* జూన్ 15 -66 డివిజన్లలో తనిఖీలు…
ఈ ప్రత్యేక ఏరివేత కార్యక్రమం కోసం గ్రేటర్ వరంగల్ పరిధిలోని మొత్తం 66 డివిజన్లలో వార్డు అధికారులతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఈ అధికారులు జూన్ 15 వరకు క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించి ప్రతి ఒక్క పింఛన్ లబ్ధిదారుడి వివరాలను నిశితంగా పరిశీలిస్తారు.
* 10 వేలకు పైగా నకిలీ పింఛన్లు…
ప్రస్తుతం వరంగల్ జిల్లా వ్యాప్తంగా దాదాపు 1.20 లక్షల మంది అర్హులకు ప్రభుత్వం సామాజిక భద్రత పింఛన్లను అందిస్తోంది. అయితే, ప్రాథమిక అంచనాల ప్రకారం ఇందులో 10 వేలకు పైగా బోగస్ పింఛన్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రత్యేక డ్రైవ్ ద్వారా అర్హులైన పేదలకు ఎటువంటి అన్యాయం జరగకుండా చూస్తూనే, ప్రభుత్వ సొమ్మును దుర్వినియోగం చేస్తున్న నకిలీ లబ్ధిదారుల ఏరివేత పూర్తి చేస్తామని అధికారులు స్పష్టం చేశారు.
ALSO READ :
