Warangal Voter List Revision
* స్టేషన్ ఘన్పూర్ SIR సమీక్ష
* ఓటరు జాబితా సవరణలో మొదటి స్థానంలో నిలవాలి
– ఎమ్మెల్యే కడియం
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్ :
ఓటర్ల తొలగింపు కోసం బిజెపి చేస్తున్న కుట్రలను మనం తిప్పి కొట్టాలని వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు కడియం కావ్య పిలుపునిచ్చారు. జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ పట్టణ కేంద్రంలో ఓటరు జాబితా సవరణ (S.I.R) పై నియోజకవర్గ SIR క్లస్టర్ ఇంచార్జ్ లు, మండల పార్టీ అధ్యక్షులు, సర్పంచులతో ఆదివారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో వరంగల్ ఎంపీ కడియం కావ్య మాట్లాడుతూ ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) కార్యక్రమాన్ని అత్యంత బాధ్యతాయుతంగా నిర్వహించాలని, అర్హులైన ఒక్క ఓటు కూడా తొలగిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వరంగల్ ఎంపీ పిలుపునిచ్చారు. ఓటరు జాబితా సవరణ ప్రక్రియను నిర్లక్ష్యంగా తీసుకుంటే భవిష్యత్తులో ప్రజలకు సంక్షేమ పథకాల లబ్ధి అందకుండా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందన్నారు. అర్హత ఉన్న ప్రతి ఓటరికి ఓటు హక్కు ఉండేలా చర్యలు తీసుకోవాలని, డబుల్ ఓట్లు, చనిపోయిన వారి పేర్లు, నకిలీ ఓట్ల తొలగింపుతో పాటు చట్టబద్ధమైన ఓటు ఎట్టి పరిస్థితుల్లోనూ తొలగిపోకుండా చూడాలని సూచించారు. ప్రస్తుతం నియోజకవర్గంలో సుమారు 80 శాతం ప్రక్రియ పూర్తయిందని, మ్యాపింగ్ పనులు 94 శాతం వరకు జరిగినట్లు తెలిపారు. మిగిలిన రోజులలో ఇంటింటికీ వెళ్లి ఓటర్ల వివరాలను సేకరించాలని, జాబితాలో లేని వారిని ఫోన్ ద్వారా సంప్రదించి నమోదు ప్రక్రియ పూర్తి చేయాలని పార్టీ శ్రేణులకు సూచించారు. అర్బన్ ప్రాంతాల్లో ఉద్యోగాలు, బదిలీలు, పిల్లల చదువుల కారణంగా ప్రజలు నివాసాలు మారడం వల్ల ఓటర్లను గుర్తించడం కష్టంగా మారుతోందని, అలాంటి ప్రాంతాల్లో మరింత శ్రద్ధ అవసరమన్నారు. రాబోయే స్థానిక సంస్థలు, శాసనసభ, పార్లమెంట్ ఎన్నికలపై కూడా ఈ సవరణ ప్రభావం ఉంటుందని తెలిపారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎస్ఐఆర్ పేరుతో పెద్ద ఎత్తున ఓట్ల తొలగింపునకు ప్రయత్నిస్తోందని ఆరోపించిన ఎంపీ, ప్రజాస్వామ్య హక్కులను కాపాడేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. నియోజకవర్గంలో కనీసం 95 శాతం వరకు ఓటర్ల ధృవీకరణ పూర్తయ్యేలా కృషి చేయాలని వరంగల్ ఎంపీ డా. కడియం కావ్య కోరారు.
* ఎమ్మెల్యే కడియం శ్రీహరి
ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో నియోజకవర్గం రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలవాలని ఎమ్మెల్యే శ్రీహరి అన్నారు. ప్రస్తుతం నియోజకవర్గం రాష్ట్రంలో 4వ స్థానంలోఉన్నట్లు స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూమ్ మీటింగ్ లో తెలపడం సంతోషం అన్నారు. నియోజకవర్గంలో నిబద్దతతో పని చేస్తున్న క్లస్టర్ ఇంచార్జ్ లు, బిఎల్ఏలకు అభినందనలు తెలిపారు. 25వ తేదీ మధ్యాహ్నం 3గంటలకు మరోసారి నియోజకవర్గ స్థాయి ఓటరు జాబితా సవరణ కార్యక్రమంపై పూర్తి స్థాయి సమావేశం ఉంటుందని అన్నారు. 25వ తేదీకి ఇంకా 6రోజుల సమయం ఉందని ఈ 6 రోజులలో ప్రతీ బూత్ లో 95 శాతం ఎన్యూమరేషన్ పూర్తి చేయాలని సూచించారు. బిఎల్ఏలు, క్లస్టర్ ఇంచార్జ్ లు, సర్పంచులు, గ్రామ శాఖ అధ్యక్షులు ప్రతీ ఒక్కరూ ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని పని చేయాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ శంకర్ నాయక్ గారు, ఏఐసిసి పరిశీలకులు అహ్మద్ నాసిర్ గారు, టీపిసిసి నియోజకవర్గ పరిశీలకులు దుద్దిల్ల శ్రీను బాబు గారు, మాస్టర్ ట్రైనర్ రాజశేఖర్ రెడ్డి గారు, హన్మకొండ, జనగామ డిసిసి అధ్యక్షులు ఇనుగాల వెంకట్రాంరెడ్డి, లకావత్ ధన్వంతి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మారుజోడు రాంబాబు, మున్సిపల్ చైర్మన్ తాటికొండ వినయ్ కుమార్, మార్కెట్ కమిటీ చైర్మన్ జూలుకుంట్ల లావణ్య శిరీష్ రెడ్డి, ఓటరు జాబితా సవరణ నియోజకవర్గ ఇంచార్జ్ లింగాల జగదీష్ చందర్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు, క్లస్టర్ ఇంచార్జ్ లు, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.
